దినకరన్ దెబ్బ: శరత్ కుమార్ భార్య రాధిక కార్యాలయంలో ఐటీ దాడులు
చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను శశికళ వర్గంలోని టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తానని ప్రకటించిన సమతువ మక్కల్ కట్చి (ఎస్ఎమ్ కే) పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు శరత్ కుమార్ కు సినిమా కష్టాలు మొదలైనాయి.
తాజాగా శరత్ కుమార్ భార్య, బహుబాష నటి రాధికాకు చెందిన రాడాన్ మీడియా వర్క్స్ కార్యాలయం మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. చెన్నైలోని టీ. నగర్ లో రాధికాకు చెందిన రాడాన్ మీడియా వర్క్స్ కార్యాలయం మీద మంగళవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేస్తున్నారు.
రాధిక అంటే రాడాన్ మీడియా వర్క్స్
1994లో రాధిక రాడాన్ మీడియా వర్క్స్ కార్యాలయం స్థాపించారు. రాడాన్ మీడియా వర్క్స్ సంస్థతోనే ఆమె అనేక టీవీ సీరియల్స్, సినిమాలు నిర్మించారు. 1999లో రాడాన్ మీడియా వర్క్స్ కార్పొరేట్ సంస్థగా ఎదిగింది.
భర్త దెబ్బతో హడలిపోయిన రాధిక
గత శుక్రవారం శరత్ కుమార్ ఇంటి మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. సోమవారం నుంగంబాక్కంలోని ఐటీ శాఖ కార్యాలయంలో అధికారుల ముందు హాజరైన శరత్ కుమార్ విచారణ ఎదుర్కొన్నారు.
ఒక్క రోజు తేడాలోనే
సోమవారం అధికారుల ముందు శరత్ కుమార్ హాజరై వివరణ ఇచ్చారు. మరుసటి రోజే ఐటీ శాఖ అధికారులు శరత్ కుమార్ భార్య రాధిక కార్యాలయంలో దాడులు చెయ్యడంతో వారు హడలిపోయారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ఎఫెక్ట్
తమిళనాడులో ఇంకా ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. శరత్ కుమార్, తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటిలో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు విలువైన పత్రాలు సీజ్ చేశారు.
మంత్రి విజయభాస్కర్, శరత్ కుమార్ చెప్పారని
మంత్రి విజయభాస్కర్, శరత్ కుమార్ ఇచ్చిన వివరాల ఆధారంగానే రాధిక కార్యాలయం మీద దాడులు చేశారని సమాచారం. ఈ దెబ్బతో టీటీవీ దినకరన్ తో సంబంధాలు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు మా ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తారో అంటూ హడలిపోతున్నారు.