తమిళనాడులో ఐటీ సోదాలు బయటపడ్డ కోట్ల కట్టలు
థేని : సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలే టార్గెట్గా జరుగుతున్న ఐటీ దాడులు చర్చనీయాంశంగా మారాయి. రెండో విడత ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ జరగనున్న తమిళనాడు, కర్నాటకలో ఐటీ దాడులు పెను దుమారం రేపాయి. తమిళనాడులోని తేనీ నియోజకవర్గ పరిధిలో మంగళవారం అర్థరాత్రి రంగంలోకి దిగిన ఐటీ అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
కలెక్టర్తో మాయవతి బూట్లు పాలిష్ చేపిస్తా..! మరోసారి నోరు జారిన అజం ఖాన్
రూ.1.48కోట్లు సీజ్
తేనీ నియోజకవర్గ పరిధిలో ఓ దుకాణంలో భారీ మొత్తంలో నగదు ఉందన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా టీటీవీ దినకరన్ పార్టీకి చెందిన కార్యకర్త దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడి నుంచి రూ.1.48కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు 94 ప్యాకెట్లలో ఉండగా వాటిపై వార్డు నెంబర్లతో పాటు ఓటర్ల సంఖ్య రాసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గాల్లోకి కాల్పులు
ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాల సమయంలో టీటీవీ దినకరన్కు చెందిన ఏఎమ్ఎమ్కే పార్టీ కార్యక్తర్తలు ఆందోళనకు దిగారు. అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
కనిమొళి నివాసంలో దాడులు
ఇదిలా ఉంటే తూత్తుకుడి లోక్సభ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి, కనిమొళికి ఐటీ దాడులు తప్పలేదు. కురింజి నగర్లో ఆమె నివసిస్తున్న ఇల్లు, ఆఫీసులో అధికారులు సోదాలు జరిగాయి. ఓటర్లకు నగదు పంచుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేశామని అయితే ఇంట్లోగానీ, ఆఫీసులో గానీ ఎలాంటి నగదు దొరకలేదని ప్రకటించారు. ఐటీ సోదాలపై కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ శాఖ మోడీ కూటమిలో భాగమైందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్ నివాసంలో భారీగా నగదు ఉన్నా అకకడ ఎందుకు సోదాలు జరగడంలేదని డీఎంకే ప్రెసిడెంట్ స్టాలిన్ ప్రశ్నించారు.