లాకర్ లో రూ. 800 కోట్ల అక్రమ ఆస్తుల కేసు: బీజేపీ లీడర్ ప్రసాద్ రెడ్డి ఇంటిలో ఐటీ దాడులు!
బెంగళూరు: బెంగళూరు బౌరింగ్ ఇన్సిట్యూట్ లోని మూడు లాకర్లలో స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, బంగారు, రూ. వందల కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు పరిశీలించిన ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు బీజేపీ నాయకుడి ఇంటి మీద దాడులు చేశారు.
బెంగళూరు నగరంలోని కోరమంగలలో నివాసం ఉంటున్న ప్రసాద్ రెడ్డి అనే బీజేపీ నాయకుడి ఇంటిలో సోమవారం ఉదయం నుంచి ఐటీ శాఖ సోదాలు జరుగుతున్నాయి. బౌరింగ్ ఇన్సిట్యూట్ లోని లాకర్లలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు, ఆస్తుల పత్రాలకు రాజకీయ నాయకులకు సంబంధం ఉందని మొదట నుంచి ఐటీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
బౌరింగ్ ఇన్సిట్యూట్ లోని మూడు లాకర్లు గుజరాత్ కు చెందిన వ్యాపారి అవినాష్ ఉపయోగిస్తున్నాడని ఐటీ శాఖ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. లాకర్లలో చిక్కిన లాకర్లలోని నగదు, బంగారం, ఆస్తుల ప్రతాల విషయంలో విచారణను అడ్డుకోవడానికి కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సందర్బంలో బెంగళూరు నగరంలోని కోరమంగలలోని బీజేపీ నాయకుడు ప్రసాద్ రెడ్డి ఇంటిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చెయ్యడంతో ఆ పార్టీ నాయకులు హడలిపోయారు. ప్రసాద్ రెడ్డితో పాటు లాకర్లు ఉపయోగించిన వ్యాపారి అవినాష్ ను అధికారులు విచారణ చేస్తున్నారు.