ఏం జరుగుతోంది: రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ముంబై సివిల్ కాంట్రాక్టర్లపై ఐటీ సోదాలు
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో పలువురు కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లోని సివిల్ కాంట్రాక్టు చేస్తున్న వ్యక్తులపైనే ఈ దాడులు జరగడం విశేషం. ఇక ముంబైలోని సివిల్ కాంట్రాక్టర్లతో పాటు గుజరాత్ సూరత్లోని సివిల్ కాంట్రాక్టర్లపై కూడా ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది.
President's rule: షాకింగ్ ట్విస్ట్: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు: గడువు దాటిన మరుక్షణమే..
సోదాలు మొత్తం 37 ప్రాంతాల్లో జరిగాయి. ఇక లెక్కలను పరిశీలించిన ఐటీ శాఖ చాలామంది కాంట్రాక్టర్లు లోన్లు తీసుకున్నట్లు తమ ఖాతా పుస్తకాల్లో పొందుపర్చారని తేల్చాయి. ఆదాయంను కూడా కరెక్ట్గా చూపించలేదని ఐటీ శాఖ వెల్లడించింది .ఇక ఇప్పటి వరకు లెక్కలు లేని డబ్బులు రూ.735 కోట్లుగా ఉందని ఐటీ శాఖ వెల్లడించింది. ఇక సోదాల సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ కొన్ని బోగస్ కంపెనీలను కనుగొంది. అంతేకాదు నకిలీ బ్యాంకు ఖాతాలు, ఫోర్జరీ సంతకాలు కూడా ఉన్నట్లు ఐటీ శాఖ తెలిపింది. కొంతమంది ప్రమోటర్లు స్థిరాస్తులపై ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పిన ఐటీ శాఖ ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందారని పేర్కొంది.
కాంట్రాక్టర్ల సమూహాలు బోగస్ కొనుగోళ్లు, సబ్ కాంట్రాక్టు పేర్లతో లోన్లు తీసుకోవడం వంటివి ఐటీశాఖ గుర్తించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెప్పిన ఐటీ శాఖ.. త్వరలోనే ఈ బోగస్ కొనుగోళ్ల ద్వారా లబ్ది పొందిన ఇతరులను గుర్తిస్తామని చెప్పింది. రుణాలు పొంది నకిలీ లెక్కలను కాంట్రాక్టర్లు చూపించారని వెల్లడించింది. అంతేకాదు ఐటీశాఖకు దొరికన ఆధారాలను పరిశీలిస్తే పెద్ద ఎత్తున పన్నును కట్టకుండా ఎగవేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మనీలాండరింగ్కు కూడా ఈ కాంట్రాక్టర్లు పాల్పడినట్లు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది. బ్యాంకులను ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారని తమ విచారణలో తేలినట్లు ఐటీ శాఖ వివరించింది.