రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా ఐటీ సోదాలు: సన్నిహితుల వద్ద రూ. 6కోట్లు సీజ్
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఐటీ దాడులు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. అదీ గాక రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సన్నిహితుల నివాసాల్లోనే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం.
ఢిల్లీ, కోటా, జైపూర్, ముంబైలలోని సీఎం అశోక్ గెహ్లాట్ సన్నిహితుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అశోక్ గెహ్లాట్ కుమారుడి వ్యాపార భాగస్వామి రతన్ కాంత్ శర్మ లాకర్లోని రూ. 5 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలో జరిపిన ఐటీ దాడుల్లో ఆ శాఖ రూ. 12 కోట్లు నగదును స్వాధీనం చేసుకోవడం గమనార్హం. లెక్కల్లోకి రాని రూ. 1.7 కోట్ల విలువైన ఆభరణాలను ఈ ఐటీ సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు.
ఇది ఇలావుండగా, కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్కు రాజస్థాన్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జులై 21 వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తోపాటు 18 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సచిన్ పైలట్ సహా 18 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహిత్గీ వాదించారు. జులై మొదటి వారంలో జరిగిన కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలో సచిన్ పైలట్ తోపాటు 18 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.