పోలింగ్ కు 48 గంటలు: మాజీ ప్రధాని బంధువునూ వదల్లేదు: తెల్లవారుజాము నుంచే ఐటీ దాడులు
బెంగళూరు: మరో48 గంటలు. దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ఏర్పాట్లు సాగుతున్న వేళ.. కర్ణాటకలో ఆదాయపు పన్ను అధికారుల దాడులు కలకలం రేపాయి. రాజకీయ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచే కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఐటి అధికారులు ఏకకాలంలో దాడులు ఆరంభించారు. రాజధాని బెంగళూరు సహా మండ్య, హాసన, మద్దూరుల్లో జనతాదళ్ (సెక్యులర్) పార్టీకి చెందిన కీలక నాయకుల నివాసాలపై దాడులు చేశారు. మధ్యాహ్నం వరకూ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లతో పాటు లెక్క తేల్చని నగదును కూడా భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అబ్ ఆప్ కీ బార్: పొత్తుల ద్వారాలు తెరిచే ఉన్నాయంటోన్న రాహుల్
దేవేగౌడ సోదరుడి కుమారుడి ఇంటిపైనా దాడులు..
మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవేగౌడ సోదరుడి కుమారుడి నివాసంపైనా ఐటీ అధికారులు దాడులు చేశారు. దేవేగౌడ సోదరుడి కుమారుడు పాపణ్ణ హాసనలో నివాసం ఉంటున్నారు. ఆయన జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు. ఆయన నివాసంలో పెద్ద ఎత్తున లెక్క చూపని నగదు ఉన్నట్లు పక్కాగా సమాచారం అందడంతో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దేవేగౌడ పెద్ద కుమారుడు, మంత్రి రేవణ్ణ ఆప్తమిత్రుడు, జడ్పీ సభ్యుడు పుట్టరాజు ఇంటిలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. మండ్య జిల్లాలోని మద్దూరు జిల్లా పంచాయతీ ఛైర్ పర్సన్ నాగరత్న స్వామి, ఆమె భర్త ఎస్పీ స్వామి నివాసాల్లో తనిఖీ కొనసాగుతోంది. జిల్లాలోని సోమన్నహళ్లిలోని గెస్ట్ హౌస్ లో కూడా తనిఖీలను చేపట్టారు.
ఓటర్లకు పంచడానికి పెద్ద మొత్తంలో నగదు?
హాసనలో పాపణ్ణ నివాసంతో పాటు అయిదుమంది ఆయన సంబంధీకుల నివాసాలపై ఏకకాలంలో దాడులు చోటు చేసుకున్నాయి. ఇంకా కొనసాగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం.. పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన పెద్ద మొత్తంలో నగదును పాపణ్ణ సహా ఆయన బంధువుల ఇళ్లల్లో దాచి పెట్టారంటూ పక్కాగా సమాచారం అందడం వల్లే ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో పాపణ్ణకు చెందిన బంధువుల ఇంటిపైనా దాడులు చేపట్టారు..
జేడీఎస్ నేతలే టార్గెట్?
దేవేగౌడ మనవడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ప్రస్తుతం.. మండ్య లోక్ సభ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే- దేవేగౌడ రెండో మనవడు, మంత్రి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ కూడా హాసన లోక్ సభ బరిలో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలను టార్గెట్ గా ఐటీ దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలపై జేడీఎస్ కు తిరుగులేని పట్టు ఉంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండంటినీ జేడీఎస్ తన ఖాతాలో వేసుకోగలిగింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఈ రెండు చోట్ల జేడీఎస్ హవా వీస్తోందని తెలుస్తోంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కావాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ లోగా- జేడీఎస్ కు చెందిన కీలక నేతలు, దేవేగౌడ బంధువుల నివాసాలపై ఐటీ దాడులు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
ఉద్దేశపూరకమేనా?
పోలింగ్ సమీపించిన ప్రస్తుత తరుణంలో జేడీఎస్ నాయకులను మాత్రమే టార్గెట్ గా చేసుకుని ఐటీ దాడులు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. మండ్య, హాసన లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోన్న దేవేగౌడ ఇద్దరు మనవళ్లు నిఖిల్ గౌడ, ప్రజ్వల్ రేవణ్ణలను ఓడించడానికి, పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఐటీ దాడులు చేస్తున్నారని, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని జేడీఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ.. తమ గెలుపును బీజేపీ అడ్డుకోలేదని అంటున్నారు. మండ్య లోక్ సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నటి సుమలతకు బీజేపీ తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. బీజేపీ అక్కడ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. ఈ విషయంలో బీజేపీ వాదన భిన్నంగా ఉంది. దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని వారంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, క్వారీ పరిశ్రమలు, పెట్రోలు బంకుల యజమానులు, కాంట్రాక్టర్లు, సహకార బ్యంకుల ఛైర్మన్ల నివాసాలపై దాడులు కొనసాగుతున్నాయని, దీనిపై జేడీఎస్ నాయకులు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని బీజేపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు.