370 కోసమే: చిదంబరం అరెస్టుపై కార్తీ చిదంబరం
చెన్నై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆయన కుమారుడు కార్తీ చిదంబరం స్పందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దును పక్కదోవపట్టించేందుకే తన తండ్రిని అరెస్ట్ చేశారని కార్తీ చిదంబరం ఆరోపించారు.
'ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసింది' అని కార్తీ చిదంబరం అన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. మాజీ కేంద్రమంత్రిని ఇంత అమర్యాదపూర్వకంగా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. చిదంబరం క్రమం తప్పకుండా విచారణకు హాజరవుతున్నా.. సీబీఐ ఆయనను ఎందుకు అరెస్ట్ చేసిందని నిలదీశారు.
చిదంబరం చట్టం నుంచి తప్పించుకు తిరుగుతున్నారని ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కార్తీ చిదంబరం తెలిపారు. తనకు ఐఎన్ఎస్ మీడియాతో సంబంధం లేదని తెలిపారు. 2017లో తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, నాలుగు సార్లు తన నివాసంలో సోదాలు చేశారని చెప్పారు. 20సార్లు తనకు సమన్లు జారీ చేశారని, ప్రతి సమన్కు తాను 10-12గంటలపాటు విచారణకు హాజరయ్యానని కార్తీ తెలిపారు.
తాను 11రోజులపాటు సీబీఐకి అతిథిగా కూడా ఉన్నట్లు కార్తీ చిదంబరం తెలిపారు. తనపై ఎలాంటి కేసు లేదని, ఛార్జీషీటు కూడా లేదని అన్నారు. చిదంబరం అరెస్టును కొన్ని మీడియా సంస్థలు నాటకీయంగా చూపుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ ఈ కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉందని, విచారణలో ఎలాంటి నిజాయితీ లేదని కార్తీ ఆరోపించారు.
2008లో జరిగితే 2017లో ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇప్పటికీ ఈ కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉండిపోయిందని కార్తీ చిదంబరం ధ్వజమెత్తారు. తన తండ్రిని వేధింపులకు గురిచేయడానికి ఈ అరెస్ట్ అని ఆయన ఆరోపించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్పందిస్తూ.. తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని, తాము న్యాయబద్ధంగానే నడుచుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ తమతోనే ఉందన్న కార్తీ చిదంబరం.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తాము రాజకీయంగా, న్యాయపరంగానూ విజయం సాధిస్తామని కార్తీ చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.