పరిస్థితులు మారాయి.. పవన్ వెళ్తారా?, చిరంజీవి మాత్రం ఫిక్స్..
బెంగళూరు: దేశవ్యాప్తంగా కర్ణాటక ఎన్నికల పైనే అందరి దృష్టి నెలకొంది. మే 12న ఎన్నికలు జరగనుండటంతో ఆయా పార్టీలు ప్రచార పర్వాన్ని వేగవంతం చేశాయి. ప్రధానంగా పార్టీలన్ని తమ ప్రచారానికి సినీ గ్లామర్ జోడించాలని చూస్తున్నాయి.
Recommended Video
ఈ క్రమంలో ఇప్పటికే ఆయా పార్టీలు కొందరు నటీనటులను రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇదే నేపథ్యంలో జేడీఎస్(జనతాదళ్ సెక్యులర్) పార్టీ కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ను రంగంలోకి దించాలని భావిస్తోంది. అయితే జేడీఎస్ తరుపున ప్రచారానికి పవన్ సుముఖంగా ఉన్నారా? అన్నదే ిప్పుడు తలెత్తుతున్న ప్రశ్న.
పవన్ వెళ్తారా?:
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కుమారస్వామికి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో తన కుమారుడి సినిమా విడుదల సమయంలో పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు కుమారస్వామి. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల గురించి కూడా ఆయన ప్రస్తావించినట్టు చెబుతారు. జేడీఎస్ తరుపున ప్రచారానికి పవన్ కూడా కుమారస్వామికి హామి ఇచ్చారన్న ప్రచారం జరిగింది.
పరిస్థితులు మారాయి:
కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదాపై కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. ఇక జేడీఎస్ పార్టీ విషయానికొస్తే.. బీజేపీతో ఆ పార్టీకి లోపాయకారీ ఒప్పందం ఉందన్నది కర్ణాటకలో సాగుతున్న రాజకీయ ప్రచారం.
అక్కడి తెలుగు ప్రజల్లో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్కు మద్దతునివ్వడం అంటే పరోక్షంగా బీజేపీకి సహాయం చేయడమేనని పవన్ భావిస్తున్నారట. అందుకే కర్ణాటక ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగానే ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ తరుపున చిరంజీవి:
మరోవైపు పవన్ కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి మాత్రం కర్ణాటక కాంగ్రెస్ తరుపున ప్రచారానికి వస్తారని కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి కర్ణాటక-ఏపీ సరిహద్దు జిల్లాల్లో మెగాస్టార్ పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారని సమాచారం. గతంలో 2013 అసెంబ్లీ ఎన్నికల్లోను చిరంజీవి కాంగ్రెస్ తరుపున అక్కడ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ, కాంగ్రెస్ లలో సినీతారల జోరు..:
బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీలో అనురాధ, మాళవిక, జగ్గేశ్, రక్షిత, శృతి లాంటి సినీ తారలు ఉన్నారు. అనురాధ ప్రస్తుతం పార్టీ ఎమ్మెల్సీ కాగా, జగ్గేశ్ గతేడాది వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. మాళవిక ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలోనూ సినీతారలకు కొదువ లేదు. మూడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన అంబరీష్.. ఇటీవలి కాలంలో మాత్రం పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరో తార ఉమాశ్రీ స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఐదేళ్ల పాటు కొనసాగారు. రమ్య మాజీ ఎంపీగానే కాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు.
నటి భావన, నటుడు చేతన్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తున్నారు. మరో నటుడు కిచ్చా సుదీప్ కుమారస్వామికి మద్దతు తెలుపుతున్నట్టు సంకేతాలు పంపించారు. మొత్తం మీద కర్ణాటక ఎన్నికల్లో సినీ తారల కోలహాలం బాగానే కనిపిస్తోంది.