ఇది 2019-20కి మధ్యంతర బడ్జెట్: స్పష్టం చేసిన ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్
ఢిల్లీ: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది కేంద్ర ఆర్థికశాఖ. ఈ సారి మధ్యంతర బడ్జెట్ 2019-20ని కేంద్రం ప్రవేశపెట్టనుందని స్పష్టం చేసింది. ఈ బడ్జెట్ను మధ్యంతర బడ్జెట్గా పరిగణిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇక ఈ బడ్జెట్పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని పీయూష్ గోయల్ చెప్పారు. అంతేకాదు ఇది మోడీ ప్రభుత్వంలో చివరి బడ్జెట్ అని కూడా వెల్లడించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13వ తేదీవరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.
సాధారణంగా ఎన్నికల సంవంత్సరంలో మధ్యంతర బడ్జెట్ కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ ప్రవేశపెడ్తారు. ఆ తర్వాత అంటే ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన పీయూష్ గోయల్ బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఉండటంతో కొద్ది రోజులు క్రితం గోయల్కు అదనంగా ఆర్థికశాఖ మంత్రి బాధ్యతలు మోడీ అప్పజెప్పారు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ తన చికిత్స కోసం అమెరికా వెళ్లారు.
గోయల్కు ఆర్థికశాక బాధ్యతలు అప్పగించక ముందు ఓటాన్ అకౌంట్కంటే మంచి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని జైట్లీ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆదేశ బడ్జెట్ పైనే ఆధారపడి ఉంటుదని వ్యాఖ్యానించిన జైట్లీ... అదే సమయంలో పలు సవాళ్లను ఎలా ఎదుర్కొంటామనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతుందని వెల్లడించారు. సాధారణంగా బడ్జెట్ను ప్రతి ఏటా ఫిబ్రవరి చివరిరోజున ప్రవేశపెట్టే ఆనవాయితీ ఉండేది. కానీ 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాక ఆ ఆనవాయితీకి బ్రేక్ చెబుతూ ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతోంది.