మరీ ఇంత బాధ్యతారాహిత్యమా? చిన్న పిల్లల్ని.. ఇలాంటి ప్రయోగాలా చేయమనేది?
నాలుగో తరగతి పర్యావరణ శాస్త్రం పుస్తకంలో పాఠాలు రాసిన వాళ్లెవరోగానీ.. ఇంగిత జ్ఞానాన్నిగాలికొదిలేశారు. సజీవాలు గాలి పీల్చుకుంటాయని చెప్పడానికి వాళ్లు చేయమన్న ప్రయోగం చూస్తే ఒళ్లు జలదరిస్తుంది.
ముంబై: పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉండాలో, ఆ పాఠ్యపుస్తకాలు రాసేవాళ్లు మరింత బాధ్యతగా ఉండాలి. పాఠాలు, వాటిలోని ప్రయోగాలు రాసేటప్పుడు అత్యంత సున్నితంగా వ్యవహరించాలి.
అయితే నాలుగో తరగతి పర్యావరణ శాస్త్రం పుస్తకంలో పాఠాలు రాసిన వాళ్లెవరోగానీ.. ఇంగిత జ్ఞానాన్నిగాలికొదిలేశారు. సజీవాలు గాలి పీల్చుకుంటాయని చెప్పడానికి వాళ్లు చేయమన్న ప్రయోగం చూస్తే ఒళ్లు జలదరిస్తుంది.
సజీవాలు బతికుండాలంటే గాలి పీల్చుకోవాలని, గాలి లేకుండా ఏ జీవి కూడా కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకలేదని ఆ పాఠంలో వివరించారు. ఈ విషయాన్ని నిరూపించడానికి వాళ్లు ఒక ప్రయోగం చేయాల్సిందిగా చిన్నారులకు సూచించారు.
This. Is. Just. Unbelievable.
— Farhan Akhtar (@FarOutAkhtar) February 9, 2017
From a Class IV textbook on Environmental Studies. Anyone responsible for this reaching the kids desks? pic.twitter.com/NJ2FWkwO0O
ఆ ప్రయోగం ఏమిటంటే.. ''రెండు చెక్క పెట్టెలు తీసుకోవాలి. ఒక పెట్టె మూత మీద కన్నాలు చేయాలి. రెండోదానికి కన్నాలు లేకుండా చూసుకోవాలి. రెండు పెట్టెల్లోనూ రెండు పిల్లి పిల్లలను ఉంచి మూత వేసేయాలి. కొంత సేపటి తరువాత ఆ మూతలు తీసి చూస్తే.. మూతకు కన్నాలు లేని పెట్టెలో ఉన్న పిల్లి చనిపోయి ఉంటుంది..''ఇదీ సదరు పాఠ్య పుస్తకంలో రాసి ఉన్నది.
ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ గమనించి... ఇంత బాధ్యతారహితంగా ఎలా ఉంటారంటూ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. నాలుగో తరగతి పర్యావరణ శాస్త్రంలో ఇది ఉందని, పిల్లలకు ఇలాంటి పుస్తకాలు చేరడానికి ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు.
నటీనటులు సామాజిక బాధ్యతతో వ్యవహరించి ఇలాంటి విషయాలను పది మంది దృష్టికి తీసుకురావడం వల్ల కొంత వరకు ఉపయోగం ఉంటుంది. ఇంతకుముందు దర్శకురాలు రేణు దేశాయ్ కూడా పలు విషయాలపై ఇలాగే స్పందించి తన అభిప్రాయాలు చెప్పారు. ఇంకానయం సదరు పాఠ్యాంశాన్ని రాసిన మూర్ఖుడు పెట్టెల్లో పిల్లి పిల్లల్ని వేయమని రాశాడు కాబట్టి సరిపోయింది.. అదే పిల్లలనే కూర్చోమని రాసి ఉంటే ఎంత ఘోరం జరిగేది?