మోడీ టైమ్స్: రాజ్యసభలో మారనున్న కమలం పార్టీ లెక్కలు
"రాజ్యసభలో నేను మాట్లాడేందుకు ఇంకా యాచించాల్సి వస్తోంది. ఎందుకంటే మాకు ఇంకా పూర్తిస్థాయి మెజార్టీ పెద్దల సభలో లేదు.ఇప్పటికీ చేతులు జోడించి నమస్కరించాల్సి వస్తోంది. నేను జీ-20 సదస్సుకు విదేశాలకు వెళ్లాల్సి ఉన్నందున నన్ను మాట్లాడనివ్వండి". ఇవి ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 26న మాట్లాడిన మాటలు. మోడీ వ్యాఖ్యలపై కొందరు కాంగ్రెస్ సభ్యులు రన్నింగ్ కామెంటరీ ఇచ్చినప్పటికీ మోడీ మాత్రం బీజేపీకి ఉన్న సంఖ్యా బలం గురించి చెప్పారు. రాజ్యసభలో తాము పాస్ చేయాల్సిన బిల్లులు ఆగిపోతున్నాయని అందుకు కారణం తమకు తగిన సంఖ్యా బలం లేకపోవడంవల్లే అని మోడీ వ్యాఖ్యానించారు. ఇందులో ముఖ్యమైన ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ బిల్లులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో మోడీ ఇకపై సభ్యులను అర్థించాల్సిన అవసరం లేకుండా పోయింది.
అప్పటి బీజేపీ సంఖ్యాబలం ఇప్పుడు ఎలా ఉండబోతోంది..?
రాజ్యసభలో తాము పాస్ చేయాల్సిన బిల్లులు ఆగిపోతున్నాయని అందుకు కారణం తమకు తగిన సంఖ్యా బలం లేకపోవడంవల్లే అని మోడీ వ్యాఖ్యానించారు. ఇందులో ముఖ్యమైన ట్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ బిల్లులు కూడా ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలవడంతో నలుగురు తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇండియన్ నేషనల్ లోక్దల్ సభ్యుడు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం 76కు చేరుకుంది. జూలై 5న ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ సీట్ల కోసం నోటిఫికేషన్ వెలువడనుంది.ఒడిషాలో 3 సీట్లు, గుజరాత్లో రెండు సీట్లు, బీహార్లో ఒక సీటుకు నోటిఫికేషన్ విడుదల కానుంది.ఇందులో ఒడిషాలో మూడు సీట్లు ఏకగ్రీవం కానుండగా బీహార్లో ఒక్క సీటు కూడా ఏకగ్రీవం కానుంది. ఇక గుజరాత్లోని రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. బీజేపీకి అసెంబ్లీలో 200 మంది ఎమ్మెల్యేలుండగా, కాంగ్రెస్కు 75 మంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది.
సుప్రీంకోర్టులో కాంగ్రెస్కు చుక్కెదురు
ఇదిలా ఉంటే రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేత ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా ఆ పిటిషన్ను కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో ఖాళీ అయిన రెండు సీట్లకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. అయితే ఈ రెండు స్థానాలు బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ రెండు స్థానాలు కూడా వస్తే బీహార్తో కలుపుకుని బీజేపీ సంఖ్యా బలం 78కి చేరుకుంటుంది. మొత్తంగా రాజ్యసభలో ఎన్డీయే సభ్యుల బలం 115కు చేరుకుంటుంది. ఎన్డీయే పార్టీలతో కలిపి ముగ్గురు ఇండిపెండెంట్లు, ముగ్గురు నామినేటెడ్ సభ్యుల మద్దతు కూడా బీజేపీకి ఉంటుంది.
కష్టసమయంలో ఆదుకోనున్న వైసీపీ
ప్రస్తుతం రాజ్యసభలో సంఖ్యాబలం 235గా ఉంది.ఆరు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత అది 241కి చేరుకుంటుంది.జూలై 5 తర్వాత జరిగే రాజ్యసభ ఎన్నికల అనంతరం బీజేపీకి సగం సంఖ్యాబలం చేరుకునేందుకు ఆరు సీట్లు తక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ, బిజూ జనతాదల్ పార్టీల నుంచి ఏడు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు.అయితే బిల్లులు పాస్ చేయించాలంటే వీరి మద్దతు ఎలాగూ ఉంటుంది కాబట్టి ఇకపై రాజ్యసభలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు ఆగిపోయే పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
రానున్న రెండేళ్లలో మరింత పెరగనున్న కమలం పార్టీ సంఖ్యాబలం
ఇక రానున్న రెండేళ్లలో ఈ పరిస్థితి బీజేపీకి మరింత సులభతరం అవుతుంది. ఉత్తర్ప్రదేశ్లో 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. యూపీ అసెంబ్లీలో 403 స్థానాలుంటే బీజేపీకి 300 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఖాళీ అవుతున్న 10 రాజ్యసభ స్థానాల్లో కమలం పార్టీ 9 సీట్లను కైవసం చేసుకుంటుంది. దీంతో ఎన్డీయే బలం 124కు చేరుకుంటుంది. ఇక మిగతా మిత్ర పక్షాలతో కూడా బీజేపీకి అంత అవసరం రాదు. సొంతంగా ఉన్న మెజార్టీతోనే మోడీ సర్కార్ బిల్లులను పాస్ చేయించగలిగే సామర్థ్యం ఏర్పడుతుంది.