రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా: అప్పుల భారం రూ.50 వేల కోట్లు!
Recommended Video
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్స్.. క్లుప్తంగా చెప్పాంటే ఆర్- కామ్. కమ్యూనికేషన్ల రంగంలో ఓ సునామీలో దూసుకొచ్చిన ఈ సంస్థ.. అంతే వేగంగా వెనక్కి మళ్లింది. కొన్నాళ్లుగా ఆర్థికంగా పాతాళానికి దిగజారిన ఈ సంస్థను ఎట్టకేలకు దివాళా తీసినట్లుగా ప్రకటించారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈ సంస్థను తన చేతుల్లోకి తీసుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. కాగా- మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పుల భారం ఆర్ కామ్ సంస్థకు ఉన్నట్లు తేలింది.
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి స్వయానా సోదరుడు అనిల్ అంబానీకి చెందిన సంస్థ ఇది. 2002 జులై 31వ తేదీన ఈ సంస్థ ఆవిర్భవించింది. రిలయన్స్ ఇన్ఫోకామ్ లిమిటెడ్ పేరుతో దీన్ని స్థాపించారు. జాతీయ స్థాయి నెట్వర్క్ కలిగిన సీడీఎంఏ 2000 సర్వీసులను మొదట్లో అందించింది. అనంతరం 2004 జులై 15వ తేదీన ఈ సంస్థలో మార్పులు చేశారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్గా మార్చారు. నాలుగేళ్ల తరువాత అంటే 2008లో జీఎస్ఎం సర్వీసులను తొలిసారిగా ప్రవేశపెట్టింది. 2010లో స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొని 3జీ నెట్వర్క్కు అవసరమైన లైసెన్స్లను సాధించింది. దీనికోసం ఆ సంస్థ 58,642 కోట్ల రూపాయలను ఫీజుల రూపంలో చెల్లించింది.
ఆ తరువాత అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందా సంస్థ. కమ్యూనికేషన్ల రంగంలో పోటీ సంస్థలు పుట్టుకు రావడంతో వాటిని ధీటుగా ఎదుర్కొన లేకపోయింది. క్రమంగా ప్రతిష్ఠ మసకబారుతూ వచ్చింది. 2016 సెప్టెంబర్ 14వ తేదీన రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థను ఎయిర్ సెల్కు చెందిన మ్యాక్సిస్ కమ్యూనికేషన్స్లో విలీనం చేయడానికి ప్రయత్నాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు సంస్థలు 50 శాతం చొప్పున భాగస్వామ్యం చేసుకునేలా ఒప్పందాలు కుదిరాయి.
మ్యాక్సిస్ కమ్యూనికేషన్ల కొనుగోళ్లలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తేలడం, సీబీఐ దర్యాప్తు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎయిర్సెల్పై నిషేధం ఉండటం.. వంటి కారణాలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ను దెబ్బకొట్టాయి. ఎరిక్సన్ కేసు సైతం వెంటాడింది. ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన వందల కోట్ల రూపాయల రుణాలు తడిసి మోపెడు అయ్యాయి. అదే సమయంలో తన సోదరుడు ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో పేరుతో కమ్యూనికేషన్ల మార్కెట్లో అడుగు పెట్టడంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ఉచిత సిమ్, సర్వీసులతో రిలయన్స్ జియో తొలి అడుగే ప్రభంజనాన్ని సృష్టించిన ప్రభావానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ బలైంది. క్రమంగా- ఆర్థికంగా కుదేలైపోయింది. ఇక తేరుకోలేకపోయింది. రెండేళ్ల క్రితం కార్యకలాపాలు నిలిపేసింది.
సంస్థకు మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలు ఉన్నాయి. ఎరిక్సన్ సంస్థకు 1500 కోట్ల రూపాయల రుణాన్ని ఆర్ కామ్ చెల్లించాల్సి ఉంది. ఆ సంస్థ యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ముఖేష్ అంబాని జోక్యం చేసుకున్నారు. తన తమ్ముడి తరఫున 450 కోట్ల రూపాయలను ఆ సంస్థకు చెల్లించారు. చైనా డెవలప్మెంట్ బ్యాంక్నకు ఒక బిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని రుణ రూపంలో చెల్లించాల్సి ఉంది ఆర్ కామ్. సంస్థను దివాళా తీసినట్లు ప్రకటించాలని కోరుతూ గురువారం అనిల్ అంబానీ నేతృత్వంలోని డైరెక్టర్ల బోర్డు.. ఎన్సీఎల్టీకి ప్రతిపాదనలను పంపించింది. దీన్ని పరిశీలించిన అనంతరం ఎన్సీఎల్టీ.. ఈ ప్రతిపాదలపై ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దాఖలైన దివాళా పిటిషన్ పైన నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు ఇదివరకు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు 357 రోజులు మినహాయింపు ఇవ్వాలని ఆర్కాం సంస్థ విజ్ఞప్తి చేసింది. దీన్నిట్రైబ్యునల్ అంగీకరించింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. అప్పటికి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రిసొల్యూషన్ ప్రొఫెషనల్కు ఆదేశాలు జారీ చేసింది ట్రైబ్యునల్. దీంతో ఆర్.కామ్ స్పెక్ట్రంను జియోకు విక్రయించేందుకు సిద్ధపడింది. వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదు.