అమ్మ మరణానికి అసలు కారణమదేనా?.. శశికళ స్పందిస్తారా!
అమ్మ ఆరోగ్యానికి సంబంధించి తొలి నుంచి అన్ని వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ వచ్చిన్న నేపథ్యంలో.. అపోలోలో అసలేం జరుగిందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
చెన్నై: తమిళ దివంగత సీఎం జయలలిత చివరి రోజులు అత్యంత నాటకీయ పరిణామాల నడుమ సాగడం చాలామందిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. 74రోజుల పాటు సుదీర్ఘంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.. ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఎవరికీ ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది.
కోలుకుందని చెప్పారు కానీ..
జయలలిత ఆరోగ్యం కుదుట పడిందని, ఇక ఆమె ఎప్పుడైనా డిశ్చార్జి అయి వెళ్లిపోవచ్చని అపోలో డాక్టర్లు ప్రకటించిన కొద్ది గంటలకే అమ్మకు సంబంధించి మరో షాకింగ్ వార్త వెలువడింది. ఆమె గుండెపోటుకు గురయ్యారని వైద్యులు ప్రకటించడంతో.. అసలు అమ్మకు ఏం జరిగిందన్న ఆందోళన ప్రతీ ఒక్కరిలోను ఉత్కంఠను రేపింది.
ఎందుకలా జరిగింది..?
వాస్తవానికి అందరు భావిస్తున్నట్టుగా జయలలిత కేవలం డీహైడ్రేషన్ తో మాత్రమే బాధపడట్లేదని, ఆమెను డయాబెటీస్ సమస్య కూడా తీవ్రంగా వేధించిందని డాక్టర్లు చెబుతున్నారు.
ఆ రెండు సమస్యల వల్లే..
గుండె సంబంధిత వ్యాధితో పాటు క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసార్డర్(సీఓపీడీ) అనే మరో సమస్య ఆమ్మ మరణానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు వైద్యులు. ఈ రెండు సమస్యల వల్లనే అమ్మకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు.
బ్రెయిన్ డెడ్ కారణంగానే అమ్మ మరణం..
అమ్మ అపోలోలో చేరిన కొన్నాళ్లకే ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని.. దాంతో పాటు డయాబెటీస్ తీవ్ర సమస్యగా మారడం, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసార్డర్(సీఓపీడీ) వంటి సమస్యలతో డిసెంబర్ 4న బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలిపారు. ఆమెను కాపాడటానికి చేయాల్సినంత చేశామని, అయినా ఆమె శరీరం చికిత్సకు స్పందించలేదని పేర్కొన్నారు.
గోప్యంగా ఉంచడంపై అనుమానాలు..
అమ్మ ఆరోగ్యానికి సంబంధించి తొలి నుంచి అన్ని వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూ వస్తున్న నేపథ్యంలో.. అపోలోలో అసలేం జరుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితి అపోలో వైద్యులను వేలెత్తి చూపేదిగా మారడంతో.. అమ్మ మరణంపై వారు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
శశికళకు మాత్రమే తెలుసు..
జయ చివరి రోజుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితిని దగ్గరి నుంచి గమనించిన ఒకే ఒక వ్యక్తి ఆమె నెచ్చెలి శశికళ మాత్రమే. కాబట్టి అమ్మ మరణానికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయగలిగేది ఆమె ఒక్కరే. ఇంతవరకైతే దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. మున్ముందు స్పందిస్తారో లేదో తెలియదు. ఆమె గనుక ఇదే మౌనం కొనసాగిస్తే.. అమ్మ మరణంపై జనాల్లో నెలకొన్న అనుమానాలు.. అనుమానాలుగానే మిగిలిపోతాయి.