పార్టీలు ఎందుకలా ప్రచారం చేసుకుంటున్నాయి: రాష్ట్రపతికి మాజీ త్రివిధ దళాల చీఫ్లు లేఖ
న్యూఢిల్లీ: బాలాకోట్పై భారత బలగాలు చేసిన దాడులను పార్టీలు రాజకీయం చేయడం తగదని పేర్కొంటూ త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు మాజీ త్రివిధ దళాల ఛీఫ్లు 8మంది లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల్లో బాలాకోట్ దాడులను చూపించి ఓట్లు దండుకునే ప్రయత్నం పార్టీలు చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్మీ రాజకీయాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండదని వారు గుర్తు చేశారు. అంతేకాదు త్రివిధ దళాలు ప్రభుత్వ జోక్యాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో వ్యతిరేకించాయని అన్నారు.
ఇక లేఖ రాసి సంతకాలు చేసిన వారిలో మాజీ ఆర్మీ చీఫ్లు జనరల్ ఎస్ఎఫ్ రాడ్రిగ్స్, జనరల్ దీపక్ కపూర్, మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్సీ సూరీ, మాజీ నేవీ చీఫ్ సురేష్ మెహతాలు ఉన్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు మాజీ త్రివిధ దళాధిపతులు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేసిన "మోడీ జీ కి సేనా " వ్యాఖ్యలను ఈ లేఖలో ప్రస్తావించారు.
శతృదేశాలపై భారత బలగాలు చేసిన దాడులను రాజకీయ లబ్ధికోసం వినియోగించుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ మాజీ చీఫ్లు తెలిపారు. జవాన్లను మోడీ సైన్యం అని యూపీ సీఎం తన ర్యాలీల్లో చెప్పడాన్ని వీరు తప్పుబట్టారు. ఇప్పటికే ఎన్నికల సంఘం యోగీ ఆదిత్యనాథ్ను హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఇక పార్టీ కార్యకర్తలు మిలటరీ యూనిఫాంలు ధరించి, ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫోటోలతో ప్రచారం నిర్వహించడాన్ని కూడా తప్పుబట్టారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నాయని మాజీ చీఫ్లు లేఖలో తెలిపారు. పోలింగ్కు సమయం దగ్గర పడే కొద్దీ ఇలాంటి మరిన్ని పెరుగే అవకాశం ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరారు.