కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. 170 కోట్ల హవాలా.. షోకాజ్ నోటీసు.. హైదరాబాద్ సంస్థతో లింకు?
కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. హవాలా సొమ్ము విషయంలో ఆదాయపు పన్నుశాఖ (ఐటీశాఖ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన నోటీసులకు కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం, సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
గతంలో ఐటీశాఖ దాడుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పంపిన రూ.170 కోట్ల వ్యవహారం బయటపడింది. పలు హవాలా మార్గాల్లో ఈ సొమ్మును కాంగ్రెస్ పార్టీకి చేరవేసినట్టు ఐటీశాఖ గుర్తించింది. ఆ క్రమంలో ఆ డబ్బు గురించి వివరణ ఇవ్వాలని, సొమ్ముకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. అయితే నవంబర్ 4 కేసు విచారణకు హాజరుకావాలని ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి ముట్టిన విరాళాలకు సంబంధించిన వ్యవహారంలో బోగస్ బిల్లులు ఉన్నట్టు గుర్తించింది. ఆర్థికంగా వెనుకబడిన, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం కేటాయించిన ప్రాజెక్టులకు సంబంధించి బోగస్ బిల్లులను సమర్పించినట్టు ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది.