కాంగ్రెస్కు ఐటీ టెన్షన్.. అహ్మద్ పటేల్కు మరోసారి ఐటీ సమన్లు..
కాంగ్రెస్ పార్టీని ఐటీ టెన్షన్ పెడుతోంది. పార్టీ విరాళాలకు సంబంధించిన హవాలా లావాదేవీలు,ఎన్నికల ఖర్చుల్లో జరిగిన అవకతవకలపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత,పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్కు సమన్లు జారీ చేసింది. రూ.550కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణల మేరకు సమన్లు జారీ అయ్యాయి. నిజానికి గత ఫిబ్రవరిలోనూ ఆయనకు ఐటీ నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 14న విచారణకు హాజరుకావాలని కోరింది. కానీ ఆరోగ్య సంబంధ కారణాలు చూపుతూ ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఆయనకు సమన్లు జారీ చేసినట్టు సమాచారం.
తాజా సమన్లపై స్పందించిన అహ్మద్ పటేల్ ప్రస్తుతం తాను అనారోగ్యంతో ఉన్నానని.. పైగా పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉంటున్నానని చెప్పారు. ఇలాంటి సమన్లు ఏ రాజకీయ పార్టీకైనా సాధారణమేనని, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత దానిపై స్పందిస్తానని చెప్పారు. సెక్షన్ 13A కింద ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో రాజకీయ పార్టీలకు షరతులతో కూడిన మినహాయింపులు ఈ సెక్షన్లో ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఉల్లంఘించినందుకు సమన్లు జారీ చేసినట్టు ఐటీ శాఖ తెలిపింది.
గతేడాది ఏప్రిల్ 2న మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఐటీ శాఖ చేసిన పలు తనిఖీల్లో.. అలాగే అక్టోబర్ 2019 నుంచి ఫిబ్రవరి 2020 వరకు హైదరాబాద్,విజయవాడ సహా మరికొన్ని ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో కాంగ్రెస్ పార్టీ ఫండ్లో అక్రమాలు జరిగినట్టు ఐటీ శాఖ గుర్తించింది. ఈ తనిఖీల్లో వివిధ నగరాల్లోని మొత్తం ఆరుగురు కాంగ్రెస్ పార్టీ నేతల కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. మొదట కాంగ్రెస్ పార్టీకి సమన్లు జారీ చేసిన ఐటీ శాఖ.. ఆ తర్వాత పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్కు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచింది.