అభినందన్ పాక్లో ఉన్న రోజు రాత్రి ఏం జరిగింది? చెప్పను అంటూనే కీలక విషయాలు చెప్పిన ప్రధాని!
న్యూఢిల్లీ: భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ఉదంతం మరోసారి చర్చనీయాంశమైంది. మనదేశంపై, మనదేశ సైన్యంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ.. అంత సులువుగా అభినందన్ను స్వదేశానికి అప్పగించడం వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. అభినందన్ను నిర్బంధించిన రోజు రాత్రి అటు పాకిస్తాన్లో, ఇటు భారత్లో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి సన్నాహాలు జరిగాయంటూ అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఆ అనుమానాలకు బలం కలిగించేలా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అభినందన్ను పాకిస్తాన్ తమ చెరలోకి తీసుకున్న రోజు రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు యుద్ధానికి దారి తీసేవిగా ఉన్నాయని చెప్పకనే చెప్పారు.
ఎయిర్పోర్స్లో అభినందన్ రీ ఎంట్రీ.. ఘనస్వాగతం పలికిన సహోద్యోగులు
నరేంద్రమోడీ తాజాగా- ఇండియా టీవీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సుమారు 2500 మంది ప్రేక్షకులు దీనికి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అంశాలతో పాటు రాజకీయ విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారాయన. వాటిల్లో- అత్యంత కీలకమైన, సున్నితమైన వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి అప్పగింత వెనుక చోటు చేసుకున్న పరిణామాలను వెల్లడించడానికి మోడీ అంగీకరించలేదు.
అనేక రహస్యాలు నిండిన రాత్రి..దాని గురించి మర్చిపోదాం
వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ చెరలోకి తీసుకున్న రోజును రహస్యాలు నిండిన రాత్రిగా అభివర్ణించారు నరేంద్రమోడీ. అది ఓ కరాళ రాత్రి. ఒక్క రాత్రిలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రహస్యాలు నిండి ఉన్నాయి. ఆ రహస్యాలను వెల్లడించడానికి మనస్సు అంగీకరించట్లేదు. రహస్యాలను రహస్యాలుగానే ఉండనిద్దాం..` అని మోడీ చెప్పుకొచ్చారు. అక్కడితో ఆ విషయాన్ని ముగించేశారు. యాంకర్ గుచ్చి, గుచ్చి ప్రశ్నించినప్పటికీ.. మోడీ వాటికి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. నిజానికి- పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధానికి భారత్ సన్నాహాలు చేసిందని, తనకు అండగా నిలిచిన దేశాలకు కూడా రాత్రికి రాత్రే సందేశాలను పంపించిందంటూ అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. వాటిని మోడీ ఏనాడూ ఖండించలేదు. తాజాగా ఇండియా టుడే ఇంటర్వ్యలో మోడీ వ్యవహార శైలి ఆ అనుమానాలను బలం కలగించేలా చేసింది.
పాక్పై ముప్పేట దాడి..
యుద్ధఖైదీగా తమ చేతికి చిక్కిన అభినందన్ వర్తమాన్ను పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని గంటల వ్యవధిలోనే వదిలి పెట్టిన విషయం తెలిసిందే. దీని వెనుక- ప్రపంచ దేశాల ఒత్తిడి ఉంది. అగ్రరాజ్యం అమెరికా, పాకిస్తాన్కు ఆర్థికంగా సహకరిస్తామంటూ ప్రకటించిన సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాలు అభినందన్ను అప్పగింత విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ విషయంలో చివరికి- చైనా సైతం పాకిస్తాన్కు అండగా నిలవలేదు. మనదేశానికి మద్దతు పలకనప్పటికీ.. తటస్థంగా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. అభినందన్ వ్యవహారాన్ని అంతర్జాతీయ సమస్యగా చూడలేమని, ఆ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ చైనా తేల్చిచెప్పిందట. పైగా- భారత్ యుద్ధానికి సన్నద్ధం కావడం, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, పూర్తిస్థాయి యుద్ధానికి దిగబోతుండటం వంటి పరిణామాలు ఇమ్రాన్ఖాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయని చెబుతున్నారు విశ్లేషకులు. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు రావడం, చైనా అండగా నిలవకపోవడం, భారత్ కయ్యానికి కాలుదువ్వుతుండటం వంటి పరిణామాలతో ముప్పేట దాడిని ఎదుర్కొంది పాకిస్తాన్. దీనితో అయిష్టంగానే- అభినందన్ను స్వదేశానికి అప్పగించిందంటూ వార్తలు వెలువడ్డాయి.
ఐఎస్ఐ కస్టడీలో అభినందన్..
శతృ సైన్యానికి చిక్కిన వెంటనే అభినందన్ను పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ తమ కస్టడీలోకి తీసుకుందని తెలుస్తోంది. అభినందన్ను విచారించడం వల్ల మనదేశ ఆర్మీ, వైమానిక దళ బేస్ క్యాంపులకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టుకోవచ్చని ఐఎస్ఐ భావించిందని చెబుతున్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కటువుగా వ్యవహరించిందని, అభినందన్ను వెంటనే స్వదేశానికి అప్పగించకపోతే సంభవించే పరిణామాలను వివరించి మరీ.. ఐఎస్ఐ కస్టడీ నుంచి తప్పించిందని సమాచారం. అప్పట్లో వచ్చిన ఈ తరహా వార్తలన్నింటినీ బలపరిచేలా మోడీ తాజగా వ్యాఖ్యానించడం చెప్పుకోదగ్గ అంశం.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆర్మీ నియంత్రిస్తోందా?
ఇంటర్వ్యూ సందర్భంగా మోడీ వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత దయనీయంగా ఉందో తేటతెల్లం చేశాయి. పాకిస్తాన్ విషయంలో అమెరికా, చైనా, రష్యా, సౌదీ అరేబియా వంటి దేశాలు ఓ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని మోడీ చెప్పారు. పాకిస్తాన్లో ఎవరిని సంప్రదించాలనే విషయంపై ఏ దేశానికి కూడా సరైన స్పష్టత లేదని తాను భావిస్తున్నానని అన్నారు. `పాక్లో ఎవరితో మాట్లాడాలి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతోనా? లేక ఆ ప్రభుత్వం నియమించిన సైన్యంతోనా? ఆ సైన్యంలో భాగమైన ఐఎస్ఐతోనా?` అనే అస్పష్టత ప్రపంచదేశాలకు ఉందని తాను భావిస్తున్నట్లు మోడీ చెప్పారు. దీన్ని పరిష్కరించుకోవాల్సింది ఆ దేశమేనని అభిప్రాయపడ్డారు.