దాద్రి ఘటన: అది ఆవు మాంసమే.. ఫోరెన్సిక్ నివేదిక
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని దాద్రి ఘటనలో మృతి చెందిన మహమ్మద్ అక్లాఖ్ ఇంట్లో లభించింది ఆవు లేదా దాని సంతానానికి చెందిన మాంసమేనని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్లో దాద్రి అనే గ్రామంలో ఓ ఆవు దూడ అదృశ్యమైంది.
అయితే ఈ ఆవుదూడను మహమ్మద్ అక్లాఖ్ కుటుంబం చంపి తిన్నారన్న ఆరోపణలతో స్థానిక బీజేపీ నేత నేతృత్వంలో సుమారు 100 మందికిపైగా అక్లాఖ్ కుటుంబంపై దాడి చేసి బయటకు తీసుకొచ్చి అత్యంత దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్లాఖ్ మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
గోమాంసం: అఖ్లాక్ హత్య కేసులో 10 మంది అరెస్టు
దాడిలో గాయపడిన బాధిత కుటుంబానికి యూపీ ప్రభుత్వం 45 లక్షల పరిహారంతో పాటు నాలుగు ప్లాట్లను నష్టపరిహారంగా ఇచ్చింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడి అనంతరం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే.
దాద్రి ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా గో హత్యపై నిషేధం, మత అసహనంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే మహమ్మద్ అక్లాఖ్ ఇంట్లోని ఫ్రిజ్లో నిల్వ ఉంచిన మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం దేశంలోని పలు ల్యాబ్స్కు పంపారు. తొలుత యూపీ ప్రభుత్వం నిర్వహించిన వెటర్నరీ ల్యాబ్ పరీక్ష నివేదికలో ఆ మాంసాన్ని మేక మాంసంగా తేల్చింది.
దాద్రి ఘటన: ఆ ఇంట్లో దొరికింది మేక మాంసమే..!
అయితే తాజాగా మధురలోని ఫోరెన్సిక్ నివేదిక ఆవు మాంసంగా నిర్ధారించింది. దాద్రి ఘటనకు కారణమైన మాంసం ఆవు లేదా దాని సంతానానికి చెందినగా ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొంది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో స్థానిక బీజేపీ నేతతో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు.