మీ వల్లే వరదలు: తమిళనాడుపై కేరళ సంచలనం, ముళ్లపెరియార్ ఎందుకు కారణం?
Recommended Video
తిరువనంతపురం: తమ రాష్ట్రంలో భారీ వరదలు, అపార నష్టానికి తమిళనాడు కారణమని కేరళ రాష్ట్రం సంచలన ఆరోపణలు చేసింది. ముళ్ల పెరియార్ ప్రాజెక్టు నుంచి నీటిని హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే ఆ నీరంతా వచ్చి ఇడుక్కి డ్యాంలోకి చేరిందని దీంతో పెను ప్రమాదం సంభవించిందని పేర్కొంది.
ఈ మేరకు కేరళ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ముళ్ల పెరియార్ డ్యాం నుంచి భారీగా నీరు రావడంతో ఇడుక్కి డ్యాం 15 గేట్లు ఎత్తివేశామని, దీంతో కేరళ అల్లకల్లోలంగా మారింది ఆరోపించింది.
తమిళనాడు ప్రజలకు నీటిని అందించే ముళ్లపెరియార్ డ్యాంను కేరళలో 150 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని నిర్వహణ తమిళనాడు రాష్ట్రానిదే. డ్యాం పాతది కావడం వల్ల కూల్చివేసి కొత్త డ్యాం కట్టాలని కేరళ చాలాకాలంగా చెబుతోంది. డ్యాంలో నీటిస్థాయిని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించాలని కోరుతోంది. తమిళనాడు నుంచి ఆశించిన స్పందన లేదు. ఈ కారణంగా డ్యాం నుంచి హఠాత్తుగా నీటిని విడుదల చేయడం వల్లే కేరళ ఇంత నష్టపోయిందని ఆ రాష్ట్రం సుప్రీం కోర్టులో చెప్పింది.
కేరళ జనాభా 3.48 కోట్లు. ఇందులో 54 లక్షల మంది ప్రజలు ఈ వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేరళలోని ఇడుక్కి జిల్లా పెరియార్ నది సమీపంలోని థెక్కడి దగ్గరి వెస్టర్న్ ఘాట్ వద్ద ముళ్లపెరియార్ డ్యాం ఉంది.
ముళ్లపెరియార్ డ్యాం నుంచి నీటిని క్రమంగా విడతలవారిగా విడుదల చేయాలని కోరామని, కానీ తమ విజ్ఞప్తిని తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోలేదని కేరళ ప్రభుత్వం పేర్కొంది.
ముళ్ల పెరియార్ డ్యాం కారణంగా ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్తో పాటు రెండు రాష్ట్రాలు సభ్యులుగా సూపర్ వైజరీ కమిటీ ఉందని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు లేదా ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ముళ్లపెరియార్ డ్యాం నిర్వహణపై కేరళ ప్రభుత్వం కూడా ఎప్పటికి అప్పుడు సమాచారం అడుగుతోందని చెప్పింది. కాగా, కేరళలో భారీ వరదలు, వర్షాల కారణంగా తీసుకున్న చర్యలు, ఏం చేస్తున్నారనే దానిపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆగస్ట్ 18న కేరళ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.