అక్కడి నుంచి పోటీ చేయకూడదనేది ఆమె సొంత నిర్ణయం: శాంపిట్రోడా
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గం వారణాసి నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయకపోవడం వెనక ప్రత్యేకించి ఏ కారణాలు లేవని కాంగ్రెస్ నేత శాం ప్రిటోడా అన్నారు. పోటీ చేయాలా లేదా అనేది ఆమెకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. మోడీ పై పోటీ చేయకూడదనేది ప్రియాంకా తీసుకున్న నిర్ణయమే అని శాంపిట్రోడా తెలిపారు.
" వారణాసిలో పోటీ చేయకూడదని ప్రియాంకా గాంధీ నిర్ణయించుకున్నారు. తను ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఇదొక్క నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే ఆమెకు అప్పచెప్పిన బాధ్యత చాలా పెద్దది. అందుకే ఆమె పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు." అని శాంపిట్రోడా వివరించారు. గత కొన్ని వారాలుగా ప్రియాంకా గాంధీ వారణాసిలో మోడీపై పోటీ చేస్తుందంటూ జోరుగా వార్తలు షికారు చేశాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతు అజయ్ రాయ్ను కాంగ్రెస్ అధిష్టానం పోటీకి నిలిపింది. అయితే వారణాసి నుంచి తాను పోటీ చేయాలా లేదా అన్న విషయాన్ని తన సోదరుడు రాహుల్ గాంధీకే వదిలేశారు ప్రియాంకా గాంధీ. పార్టీ తీసుకునే నిర్ణయంపైనే తాను పోటీ చేస్తానా లేదా అనేది తెలుస్తుందని ప్రియాంకా చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మెగా రోడ్ షో నిర్వహించేందుకు కొన్ని గంటల ముందు కాంగ్రెస్ పార్టీ వారణాసి నుంచి అజయ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజయ్కు 7శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. విజేతగా బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీ నిలువగా రెండవ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీచేసిన అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాంగ్రెస్కు మూడో స్థానం లభించింది. ఈ సారి ప్రియాంకా గాంధీని వారణాసి నుంచి లేదా అలహాబాదు నుంచి కానీ బరిలో దింపాలని కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చారు. కొన్ని రోజుల పాటు ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో అజయ్ రాయ్కు టికెట్ కేటాయించింది హస్తం పార్టీ.