రాజీనామాల ట్రెండ్ సెట్ చేసింది రాహుల్ గాంధీ..బీజేపీ కాదు: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: కర్నాటక సంక్షోభం లోక్సభను తాకింది. కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధిర్ రంజన్ చౌధరీ కర్నాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ కనుసన్నల్లోనే కర్నాటక సంక్షోభం జరుగుతోందని ఆయన ఆరోపించారు. పక్కా స్కెచ్ ప్రకారమే కమలం పార్టీ పావులు కదుపుతోందని చౌదరి మండిపడ్డారు.
కర్నాటకలో ప్రస్తుతం తలెత్తిన రాజకీయ సంక్షోభంలో తమ పాత్ర లేదని చెబుతూనే కమలం పార్టీ నేతలు రహస్యంగా పావులు కదుపుతున్నారని అధిర్ రంజన్ చౌధరి ధ్వజమెత్తారు. 303 మంది ఎంపీల బలం లోక్సభలో ఉందని పదేపదే చెప్పుకునే బీజేపీ... ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వంలోకి రావాలన్నఅధికార దాహం ఇంకా తీరలేదని చౌదరి మండిపడ్డారు. చౌదరి మాటలకు గట్టి కౌంటర్ ఇచ్చారు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అయితే కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల ఎపిసోడ్తో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేసిన రాజ్నాథ్ సింగ్.... రాహుల్ గాంధీ రాజీనామాతోనే దేశవ్యాప్తంగా రాజీనామాల ట్రెండ్ స్టార్ట్ అయ్యిందని కౌంటర్ ఇచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షపదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారని... ఆ తర్వాత సీనియర్లు కూడా రాజీనామా చేయడంతో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ వారు రాజీనామాలు చేయాలని రాహుల్ చెప్పిన మాటలను సభలో గుర్తుచేశారు రాజ్నాథ్ సింగ్. దీంతో ఒక్కసారిగా సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం కర్నాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కుమారస్వామి ప్రభుత్వానికి సరైన సంఖ్యా బలం లేదని వెంటనే ఆయన రాజీనామా చేయాలని బీజేపీ నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు.