ఫిబ్రవరి 8 తేదీన ఇండియా v/s పాకిస్థాన్: ఢిల్లీలో హీటెక్కించిన బీజేపీ నేత వ్యాఖ్యలు
Recommended Video
మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార ఆప్, బీజేపీ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ స్నేహితుడు, బీజేపీ నేత కపిల్ మిశ్రా నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికలను ఇండియా వర్సెస్ పాకిస్థాన్గా పోల్చి.. ప్రచార పర్వాన్ని మరింత హీటెక్కించారు.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్
ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా-పాకిస్థాన్ తలపడబోతున్నాయని బీజేపీ నేత కపిల్ మిశ్రా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆ ఎన్నికల్లో తమదే విజయమని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు.
విమర్శలు..
అంతేకాదు ఢిల్లీలోని షహీన్ బాగ్లోకి ఇప్పటికే పాకిస్థాన్ ప్రవేశించిందని కామెంట్ చేశారు కపిల్ మిశ్రా. అంతేకాదు పొరుగుదేశానికి చెందిన కొందరు ఢిల్లీ వీధుల్లో అల్లరి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మోడల్ టౌన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కపిల్ మిశ్రా రెండుసార్లు పోటీ చేశారు.
ఇదీ నేపథ్యం.
జెస్సికా లాల్ హత్యపై యూత్ ఫర్ జస్టిస్ పేరుతో కపిల్ మిశ్రా ఆందోళనలు కూడా నిర్వహించారు. తర్వాత ఆప్లో చేరి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ 2017లో సత్యేంద్ర జైన్, కపిల్ మిశ్రాపై అవినీతి ఆరోపణలు రావడంతో.. సీఎం కేజ్రీవాల్ వారిని మంత్రి పదవీ నుంచి తప్పించారు.
బీజేపీ గూటికి
గతేడాది ఆగస్ట్లో ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ నేతృత్వంలో బీజేపీలో కపిల్ మిశ్రా చేరారు. ఢిల్లీలో ప్రధాని మోడీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని కపిల్ మిశ్రా ముందుకెళ్తున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాల మేరకు పనిచేస్తామని తెలిపారు.