ఇటాలియన్ లేడీ డీజేపై ఎయిరిండియా సిబ్బంది దాడి!: ఏడుస్తూ వీడియో పెట్టిన యువతి
Recommended Video
హైదరాబాద్: తనపై దాడి చేశారంటూ ఓ ఇటాలియన్ మహిళా డీజే.. ఎయిరిండియా సిబ్బందిపై ఆరోపణలు చేశారు. విమానం ఆలస్యంపై ప్రశ్నించిన సదరు విదేశీ మహిళపై చేయిచేసుకున్నారట. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది దురుసు ప్రవర్తనపై ఆమె ఏడుస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, తాము మాత్రం ఎలాంటి దాడులకు పాల్పడలేదని ఎయిరిండియా చెబుతోంది.
టూర్లో భాగంగా భారత్కు
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటలీకి చెందిన డీజే ఓలీ ఎస్సే తన టూర్లో భాగంగా భారత్కు వచ్చింది. పర్యటన తర్వాత ఆగస్టు 19న స్వదేశానికి వెళ్లేందుకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాని(ఆర్జీఐఏ)కి చేరుకుంది.
విమాన ఆలస్యంపై ప్రశ్నిస్తే దాడి చేశారు..
అయితే తాను ఎక్కాల్సిన ఎయిర్ఇండియా విమానం 9 గంటలు లేట్ కావడంతో అక్కడి ఎయిర్ ఇండియా సిబ్బందిని ఆమె ప్రశ్నించింది. అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఒకరు ఈ సందర్బంగా డీజేతో దురుసుగా ప్రవర్తించారు. అంతేగాక, విమానం ఆలస్యంపై సరిగ్గా జవాబివ్వకుండా ఓలీపై చేయి చేసుకున్నారు. దీంతో ఈ ఘటనపై డీజే ఓలీ ఎస్సే ఆవేదన చెందుతూ ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది.
లేడీ డీజే ఆవేదన
తనపై ఎయిర్ఇండియా మహిళా సిబ్బంది ఒకరు దాడిచేశారనీ, ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు కూడా అక్కడ లేరని వాపోయింది. కాగా, ఈ ఘటనపై ఆగస్టు 19న తమకు ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సీసీటీవీతో పాటు వీడియోను పరిశీలిస్తున్నామనీ, త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అదేం లేదంటూ ఎయిరిండియా..
ఇది ఇలావుంటే, ఓలీ వాదనను ఎయిర్ఇండియా ప్రతినిధి ఖండించారు. ఓలీ ఎయిర్ఇండియా మహిళా సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియో తీసిందని, దీన్ని ఆపాల్సిందిగా మాత్రమే ఆమె కోరిందని వెల్లడించారు. చివరికి ఆ ఫోన్ను పక్కనపెట్టాలని వీడియో రికార్డును సదరు ఉద్యోగిని అడ్డుకుందన్నారు. ఈ ఘటనకు కారణమైన మహిళ తమ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోందన్నారు.