నెంబర్ 7: ఇటలీ పర్యాటకుడి భార్యకు కరోనా వైరస్.. పెరుగుతోన్న వైరస్ కేసులు..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. మంగళవారం ఇటలీ పర్యాటకుడికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్దారించగా.. అతని భార్యకు కూడా వైరస్ వచ్చిందని వైద్యులు ధృవీకరించారు. వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఆమెకు.. వైద్యులు జైపూర్ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చిందని తేలింది.
అయితే పర్యాటకుడి సాంపిల్ పుణలోని ఎన్ఐవీకి పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఆ నివేదిక బుధవారం వస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఇటలీ దంపతులకు జైపూర్ సవాయ్ మన్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కరోనా వైరస్పై అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ డీబీ గుప్తా పేర్కొన్నారు. వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. అంతేకాదు ఆస్పత్రి పరిధిలోని 3 కిలోమీటర్ల దూరంలో గల ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయా హోటళ్లలో ఎవరైనా పర్యాటకులు అనారోగ్యంగా ఉన్నారా ..? వారి వివరాలు ఇవ్వాలని కూడా కోరినట్టు ఆయన చెప్పారు.
ఇటలీ పర్యాటకుడికి శనివారం పరీక్ష నిర్వహిస్తే నెగిటివ్ అని వచ్చింది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగవడం లేదు. దీంతో సోమవారం మరోసారి పరీక్ష నిర్వహించారు. అతని రక్తనమూనాలను పుణెలో గల నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగానికి పంపించారు. పరీక్ష చేసిన నిపుణులు.. అతనికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. సోమవారం రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.