ఐటమ్ గర్ల్స్ను వేశ్యలుగా ప్రకటించాలి: హిందూ మహాసభ
న్యూఢిల్లీ: హిందూ మహాసభ నాయకుడు ఒకరు వివాదాస్పద ప్రకటన చేశారు. ఐటమ్ సాంగ్స్ చేసే తారలను వ్యభిచారులుగా ప్రకటించాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు, జాతీయ మహిళా కమిషన్ తిరోగమన దిశగా పయనిస్తున్నాయని హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ త్యాగి అన్నారు.
పాఠశాలల్లో అమ్మాయిలు గౌన్లు, జీన్స్ ధరించడాన్ని నిషేధించాలని ఆయన డిమాండ్ చేశాడు. వారికి మొబైల్ ఫోన్లను కూడా అనుమతించకూడదని ఆయన అన్నారు. సినిమాల్లో ఐటమ్ నెంబర్ చేస్తూ, దస్తులు వదిలేసే తారలను వ్యభిచారులుగా గుర్తించాలని ఆయన అన్నారు.
అశ్లీలతతో డబ్బులు సంపాదించే మహిళలను వ్యభిచారులుగానే పరిగణించాలని ఆయన అన్నారు. సమాజంలో వారు చెడును విస్తరింపజేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని త్యాగి చెప్పారు. అయితే, త్యాగి ప్రకటనతో హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి చక్రపాణి విభేదించారు. అది తప్పుడు ప్రకటన అని ఆయన అన్నారు. ఆ ప్రకటన గురించి పూర్తిగా తమకు తెలియదని, వివరాలు తెలుసుకుంటున్నామని అన్నారు.
సుప్రీంకోర్టు వెళ్తానన్న త్యాగి మాటలను ప్రస్తావించగా, ఆ స్వేచ్ఛ త్యాగికి ఉందని అన్నారు. త్యాగి ప్రకటనను జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ కుమారమంగళం వ్యతిరేకించారు. త్యాగి సుప్రీంకోర్టుకు వెళ్తే దాన్ని వ్యతిరేకించడానికి ఏం చేయాలనేది పరిశీలిస్తామని చెప్పారు.
అది సాధారణమైన తిరోగమన ఆలోచనా విధానమని, కురుచ దుస్తుల్లో మహిళనలు చూడాలని ఆశించే పురుషులను ఏమనాలని, ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని ఆమె అన్నారు. తమకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉందని ఆమె అన్నారు.