సర్వే సందడి: మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది ఈ పార్టీలే..!
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీలకు పోలింగ్ మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అప్పుడే సర్వేలు సందడి చేస్తున్నాయి. ఇక మళ్లీ ముఖ్యమంత్రులుగా ఫడ్నవీస్, మనోహర్లాల్ ఖట్టర్లే ఉంటారని ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐయాన్స్ - సీఓటర్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 మధ్య ఈ సర్వేను నిర్వహించారు.
90 స్థానాలు ఉన్న హర్యానాలో 59.8శాతం మంది ప్రజలు తిరిగి బీజేపీనే అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.15.8శాతం మంది మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించారు. ఇక అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో చెప్పలేమని 14.2శాతం మంది తమ అభిప్రాయంను వ్యక్తం చేశారు. ఇక మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తి అంటూ 40.3శాతం మంది చెప్పారు.19.9శాతం మంది కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హూడాకు ఓటువేశారు.
288 స్థానాలున్న మహారాష్ట్రలో 48.8 శాతం మంది బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా. 10.6శాతం మంది మాత్రం కాంగ్రెస్ వస్తుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎన్సీపీ అధికారంలోకి వస్తుందని 11.3శాతం, బీజేపీ మిత్రపక్షం శివసేన అధికారంలోకి వస్తుందని 9శాతం మంది చెప్పారు. ఇక ముఖ్యమంత్రిగా మెజార్టీ అంటే 34.7 శాతం మంది ఫడ్నవీస్కు ఓటువేశారు. ఉద్ధవ్ థాక్రేకు 5.1శాతం మంది ఓటువేశారు. ఇక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అయితే బాగుంటుందని 5.9శాతం మంది ఓటువేశారు.