ఎన్నికల జిమ్మిక్ : నేతాజీపై ఎప్పుడూ లేని ప్రేమ కొత్తగా ఏంటో: కేంద్రాన్ని కడిగిపారేసిన దీదీ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణమే నెలకొంది. ఆ రాష్ట్రంపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తుండగా... వారి జిమిక్కులను తిప్పి కొట్టాలని మమతా పావులు కదుపుతున్నారు. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనకు కోల్కతాకు చేరుకున్నారు. అంతకంటే ముందు దీదీ బీజేపీ, మోడీపై విమర్శలు గుప్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను బీజేపీ ఎలాగైతే తమవాడిగా చూపించుకునే ప్రయత్నం చేసిందో తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై ఇప్పుడు రాజకీయం జరుగుతోంది.
Subhash Chandrabose:నేతాజీ మృతి మిస్టరీపై రష్యా కొత్త వాదన..నెహ్రూ పాత్ర: చివరి రోజుల్లో అక్కడ..!
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా బీజేపీ - తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పోటీ పడ్డాయి. నేతాజీకి ఘనమైన నివాళులు అర్పించడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో అక్కడ హీట్ పెరిగింది. నిజంగానే కేంద్రంకు నేతాజీపై ప్రేమ ఉంటే తన పుట్టిన రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించడంలో ఎందుకు విఫలమైందని సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. ఈ స్వాతంత్ర్య సమరయోధుడికి ఒక స్మారక చిహ్నం ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ధ్వజమెత్తారు.
కొత్త పార్లమెంటు భవనం, కొత్త విమానాలను కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎందుకు గుర్తులేరని మమతా మండిపడ్డారు.ఆరు కిలోమీటర్ల మార్చ్లో పాల్గొన్న అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ వ్యవస్థాపకులు శ్యామా ముఖర్జీ పేరును ఒక పోర్టుకు పెట్టారని.. పేరు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదని చెప్పిన మమత.. కోల్కతా విమానాశ్రయంకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టాలని నాడు రాజీవ్గాంధీపై కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు దీదీ.
We have observed 'Deshnaayak Divas' today. Rabindranath Tagore called Netaji 'Deshnaayak'. What is this 'Parakram': Mamata Banerjee, West Bengal CM, on birth anniversary celebrations of Subhash Chandra Bose https://t.co/rADN6Czgcw
— ANI (@ANI) January 23, 2021
ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ తీసుకొచ్చిన ప్రణాళికా సంఘంను రద్దు చేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చిన మోడీ సర్కార్పై నిప్పులు చెరిగారు మమతా బెనర్జీ. నేతాజీ పుట్టిన రోజును దేశ్నాయక్ దివాస్గా కాకుండా పరాక్రమ్ దివాస్గా ప్రకటించడాన్ని తప్పుబట్టారు మమతా బెనర్జీ. పరాక్రమ్ దివాస్ అంటే అర్థమేంటని ప్రశ్నించిన మమతా బెనర్జీ... ఒకవేళ తనను కలిసి సలహాలు తీసుకోవడం చిన్నతనం అనిపిస్తే నేతాజీ మనవరాలు సుగతా బోస్ను సంప్రదించి ఉండాల్సిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకునే చర్యలు తప్పుగా ఉంటే అందుకు తాము ప్రతిచర్య ఏంటో చూపిస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ.