సాహస యాత్ర చేసినంత సులువు కాదు ఎన్నికలంటే..! ఉత్తరాది ప్రజా తీర్పు బీజేపికి గొడ్డలి పెట్టే..!!
ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రజల మనసులను గెలవడంలో విఫలం చెందుతుందా అంటే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు అవుననే సమాధానం చెప్తున్నాయి. బీజేపి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో సంపూర్ణ మెజారిటీతో గెలవాలి. కాని మహారాష్ట్ర, హరియాణ లో బీజేపికి గాని కాంగ్రెస్ పార్టీకి గాని సంపూర్ణ మెజారిటీ ప్రజలు ఇవ్వలేక పోయారు. అంటే అధికారంలో ఉన్న బీజేపి ప్రజల మనోభావాలకనుగుణంగా పని చేయడం లేదనే అంశం స్పష్టమవుతోంది.
జాతీయ పార్టీలకు శృంగభంగం..! మహారాష్ట్ర, హరియాణ ఎన్నికల తీర్పుతో ఖంగుతిన్న బీజేపి..!!
ఇక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుంజుంకుంటుందో తెలియక ఆపార్టీకి పూర్తి స్థాయిలో జై కొట్టలేకపోయారు ఉత్తర భారతదేశ ప్రజలు. వినూత్న పథకాలను అమలు చేస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని చెప్పుకునే బీజేపి ప్రభుత్వానికి మాత్రం మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు శృంగ భంగాన్ని కలిగించాయి. ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్, బాబ్రీ మసీదు అంశాల్లో తీసుకున్న సహసోపేత నిర్ణయాలను కూడా ప్రజలు పెద్దగా స్వాగతించినట్టు కనిపించలేదు. అందుకే భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ సంఘీభావం దక్కలేదనే చర్చ జరుగుతోంది.
మోదీ సాహసోపే నిర్ణయాలు..! అంతగా స్వాగతించని ప్రజలు..!!
ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను బహిర్గతం చేసేది ప్రత్యక్ష ఎన్నికలే. ఈ ఎన్నికలే ప్రజలకు ప్రజాస్వా మ్యం అందించిన వజ్రాయుధం అని చెప్పొచ్చు. తమకు నమ్మకం ఉన్న వ్యక్తులను పార్టీలను ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న విషయం కొత్తకాదు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న బారత్లోనూ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలో రెండు జాతీయ పార్టీలు కూడా దేశంలో ముందంజలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు ఈ క్రమంలో దూసుకుపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చేసుకున్న స్వయంకృతం ఫలితంగా దేశంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది.
రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్దితి..! ఆత్మవిమర్శలో బీజేపి..!!
మహారాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 103 సీట్లతో సరిపెట్టుకుంది. గతంలో కన్నా ఓట్లు, సీట్లు కూడా తగ్గిపోవడం ప్రజలు ఈ పార్టీని ఎంతగా విశ్వసిస్తున్నారో అర్దమవుతోంది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ను ఏమైనా గెలిపించారా? అంటే అది కూడా లేదు. మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తమను గెలిపిస్తాయని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున పుంజుకున్నది కూడా లేదు. దీనిని బట్టి ప్రజలు మహారాష్ట్రలో ఏ పార్టీని కూడా విశ్వసించలేదని తెలుస్తోంది. రెండు జాతీయ పార్టీలకూ కొరకరాని కొయ్యగా మారింది శివసేన. అయితే, ఈ పార్టీ పట్ల కూడా ప్రజలు పెద్దగా విశ్వాసాన్ని చూపించలేకపోయారు.
పనిచేయని మోదీ సాహసాలు..!పరవాలేదనిపించుకుంటున్న కాంగ్రెస్..!!
ఇక హర్యానా విషయానికి వస్తే, ఇక్కడ కూడా ప్రజలు ఏ పార్టీనీ విశ్వసించలేదు. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, స్థానిక పార్టీ జేజేపీ కానీ ప్రజల మనసులను చూరగొనడంలో పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పాలి. ఇక ప్రజాస్వామ్యంలో తప్పదు కనుక ఏదో ఒక పార్టీకి ఓటేయాలి కనుక వేసినట్టే అనిపించింది తప్ప పూర్తి నమ్మకంతో ఏ పార్టీకి ప్రజలు ఆదిఖ్యాన్ని ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ 35 సీట్లతో ఊగిసలాడుతుంటే మరో 20 సీట్లను ఇతరులు గెలుచుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో మళ్లీ స్వతంత్రులు లేదా ఇతరులే కీలకం కానున్నారు. వాస్తవ పరిస్థితులు మరిచి సాహస యాత్రలు చేస్తున్న దేశ నేతలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేయాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.