వీడియో వైరల్: ఎన్నికల ర్యాలీలో డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసిన ఓవైసీ
ఔరంగాబాద్: మహారాష్ట్ర ఎన్నికల్లో నేతలు తమ ఫీట్లను చూపిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు మహారాష్ట్రలో అడుగుపెట్టి తమ పార్టీల తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమకు తోచినట్లుగా ఆట పాటలు, డ్యాన్స్లతో ఇరగదీస్తూ స్థానిక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఔరంగాబాదుకు వెళ్లారు. అక్కడ స్థానికులు పెట్టిన పాటకు స్టెప్పులు వేసి అట్రాక్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఔరంగాబాదులోని పైథాన్ గేట్లో సభను ఉద్దేశించి ప్రసంగించారు మజ్లిస్ స్టార్ క్యాంపెయినర్ అసదుద్దీన్ ఓవైసీ. ఆ తర్వాత స్టేజ్ మీద నుంచి కిందకు దిగుతూ వస్తున్న సమయంలో ఓ పాటకు మెట్ల మీద నుంచే స్టెప్పులు వేశారు. హిప్ షేక్ చేశారు. కొన్ని సెకన్ల పాటు డ్యాన్స్ చేసి అక్కడి ఓటర్లను ఆకట్టుకున్నారు. తమ నేత స్టెప్పులను చూసిన ఓటర్లు వన్స్ మోర్ ప్లీస్ అన్నట్లుగా కేకలు వేశారు. చప్పట్లు కొడుతూ సీన్ను ఎంజాయ్ చేశారు. గాలిపటం ఎగిరివేస్తున్నట్లుగా డ్యాన్స్ మూవ్మెంట్ ఇచ్చారు అసదుద్దీన్. మజ్లిస్ గుర్తు కూడా గాలిపటం కావడంతో ఆ స్టెప్పు వేసి తమ గుర్తుకే ఓటువేయాలంటూ వెరైటీగా చెప్పారు.
Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi performs a dance step after the end of his rally at Paithan Gate in Aurangabad. (17.10.2019) pic.twitter.com/AldOABp2yd
— ANI (@ANI) October 18, 2019
ఇక ర్యాలీలో ప్రసంగించిన అసదుద్దీన్ ప్రధాని మోడీపై మండిపడ్డారు. తన ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ వివాదాస్పద అంశాలను లేవనెత్తి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడతారని దుయ్యబట్టారు. 1993లో జరిగిన ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరగలేదని ప్రసంగంలో చెబుతారని అయితే ప్రధాని తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నిందితులను పట్టుకుని యాకూబ్ అనే వ్యక్తిని ఉరితీయడం కూడా జరిగిందని ఓవైసీ గుర్తుచేశారు. అయితే శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయం చేస్తారా అని ప్రధాని మోడీని తాను సూటిగా ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు ఓవైసీ. దీనిపై మాత్రం ప్రధాని మాట్లాడరని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆలిండియా మజ్లిస్ ఈ ఇతేహాద్ ఉల్ ముస్లిమీన్ మెజార్టీ స్థానాల్లో పోటీచేస్తోంది. తమ పార్టీ తరపున ప్రచార బాధ్యతలు తీసుకున్న ఓవైసీ... తమ అభ్యర్థుల గెలుపు కోసం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.