ఇండియా వర్సెస్ పాకిస్తాన్: ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ను ఎండగట్టేందుకు భారత్ రెడీ
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై పాక్ అతిగా స్పందిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ సమాఖ్యలో భారత్ను దోషిగా నిలబెట్టాలని చూసి బొక్కబోర్లా పడింది దాయాది దేశం. ఇక చివరి అవకాశంగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్యలో భారత్పై విషం చిమ్మాలని తలుస్తోంది. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితికి తమ విదేశాంగా మంత్రి షా మెహమూద్ ఖురేషీని తమ వాదనలు వినిపించాల్సిందిగా ఆయన్ను పంపింది. సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు జెనీవాలో ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాలు జరగనున్నాయి.
పాక్ తరపున మంత్రి మొహ్మద్ ఖురేషీ వాదనలు
పాకిస్తాన్ తమ వాదనలు వినిపించేందుకు ఆదేశ విదేశాంగ మంత్రిని పంపగా... భారత్ మాత్రం సెక్రటరీ స్థాయి బ్యూరోక్రాట్ను పంపుతోంది. అసలు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ఈ అధికారి అక్కడ వివరిస్తారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని కశ్మీరీలో వేర్పాటు వాతావరణం సృష్టిస్తోందని ఈ సందర్భంగా భారత్ వాదించనుంది. ఇదిలా ఉంటే చైనా మద్దతు, ఇతర ముస్లిం దేశాల మద్దతుతో కశ్మీర్పై ఓ తీర్మానం ప్రవేశపెట్టి భారత్ను కార్నర్ చేయాలని పాక్ మంత్రి మొహ్మద్ ఖురేషీ భావిస్తున్నారు.
మద్దతు కూడగట్టే ప్రయత్నంలో పాకిస్తాన్
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్యలో కనీసం 47 మంది సభ్యుల మద్దతు కూడగట్టాలని పాక్ ప్రయత్నిస్తోంది.తద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఇస్లామిక్ సహకార సంస్థ సభ్యదేశాలు ఇక్కడ కీలకం కానున్నాయి. అయితే ఇప్పటికే 57 సభ్య దేశాలున్న ఇస్లామిక్ సహకార సంస్థలో 15 దేశాలు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్యలో సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలోనే ఈ సభ్యదేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించాయి. అంతేకాదు కశ్మీర్లో మానవహక్కులకు భంగం వాటిల్లుతోందనే ఈ దేశాలు చెప్పాయి. ఇక జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు చేయక ముందే ఈ ముస్లిం దేశాలు కశ్మీర్లో పాక్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశాయి.
అస్తశస్త్రాలతో సిద్ధమైన భారత్
మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదం ఎలా పెంచి పోషిస్తుందో చెప్పేందుకు భారత్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. పీఓకేలో మానవహక్కుల ఉల్లంఘనను పాక్ ఎలా పాల్పడుతుందో భారత్ వివరించనుంది. అంతేకాదు చైనా మద్దతు పలకడాన్ని కూడా ఈ సందర్భంగా భారత్ లేవనెత్తనుంది. ఇప్పటికే భారత్ పలు యూరోపియన్ దేశాలతో చర్చలు జరిపి పాక్ చేస్తున్న అధికప్రసంగం గురించి ప్రస్తావించింది. ఇక సోమవారం నుంచి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐస్లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాల పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా పాక్ వ్యవహారశైలిపై ఈ దేశాధినేతల దృష్టికి తీసుకురానున్నారు. ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, జపాన్, నేపాల్, ఇతర ఆఫ్రికన్ దేశాలు, ఆస్ట్రేలియా, పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలు, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ లాంటి దేశాల మద్దతు భారత్ కూడగట్టుకుంది. వీరంతా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్యలో భారత్కు ఏమేరకు మద్దతు పలుకుతారన్నది కీలకంగా మారింది.
కశ్మీర్ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్య వేదికపై జమ్మూకశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘనపై కచ్చితంగా చర్చించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘనలు పాకిస్తాన్ ఎలా పాల్పడిందో చెబుతూ గత రికార్డులను ప్రస్తావించే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ మానవహక్కుల చీఫ్ మిచెట్ బాచ్లెట్ ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు సంకేతాలు అందాయి. రెండు దేశాల సరిహద్దుల నుంచి మానవహక్కుల ఉల్లంఘనపై తమ కార్యాలయం ఇప్పటికే నివేదిక తెప్పించుకుందని మిచెల్ అన్నారు. జమ్ముకశ్మీర్లో మానవహక్కులపై భారత్ తీసుకున్న చర్యల గురించి, ఇంటర్నెట్ కమ్యూనికేషన్లపై ఆంక్షల, శాంతియుత సమావేశాలు, స్థానిక రాజకీయనాయకుల నిర్భంధించడం గురించి కాస్త ఆందోళన చెందుతున్నట్లు మిచెల్ తన ప్రారంభ ప్రసంగంలో ప్రస్తావించారు