CAA నిరసనల సెగ: కేరళ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న ప్రముఖ చరిత్రకారుడు
కన్నూర్ : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్కు పౌరసత్వ సవరణ చట్టం సెగ తాకింది. అయితే ఇది ఆందోళనకారుల నుంచి కాదు. ఓ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయనకు అదే కార్యక్రమంలో పాల్గొంటున్న పలువురు అతిథుల నుంచే ఈ సెగ తాకడం విశేషం. కన్నూర్లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రసంగిస్తుండగా అతని ప్రసంగాన్ని అడ్డుకున్నారు అదే వేదికపై ఉన్న అతిథులు. ఇందులో ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ కూడా ఉన్నారు.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న చరిత్రకారుడు హబీబ్
కన్నూర్ యూనివర్శిటీలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేరళ గవర్నర్ ఆ సమావేశంలో పౌరసత్వ సవరణ చట్టం మరియు కశ్మీర్ అంశంపై స్పందించాల్సిందిగా కొందరు అడిగారు. ఇదే విషయమై ప్రసంగిస్తూ మౌలానా ఆజాద్ పేరును ప్రస్తావించిన సమయంలో హబీబ్తో పాటు మరికొందరు అతిథులు తమ నిరసనను తెలిపారు. తాను ప్రసంగిస్తుండగా ముందుగా హబీబ్ లేచి నిలబడి తన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చెప్పారు. మహాత్మా గాంధీ, లేదా ఆజాద్ల పేర్లను ప్రస్తావించే బదులు నాథూరామ్ గాడ్సే పేరును ప్రస్తావించాలని హబీబ్ డిమాండ్ చేశారని గవర్నర్ చెప్పారు. నిరసన తెలిపే హక్కు ఉందని అయితే తన ప్రసంగాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ సందర్భంగా తలుపులు మూసేశారంటే దానర్థం హింసను ప్రోత్సహిస్తున్నట్లే అని గవర్నర్ మండిపడ్డారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్న గవర్నర్
గవర్నర్గా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఆరిఫ్ మహ్మద్ ఖాన్. కానీ తన ప్రసంగాన్ని అడ్డుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు గవర్నర్ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని వరుస ట్వీట్లను పోస్టు చేశారు. ఒక గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, అక్కడికి చేరివచ్చిన ప్రజలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉందన్న గవర్నర్ ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని కించపరిచే హక్కు లేదని తెలిపారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా హోరెత్తిన వ్యతిరేక నినాదాలు
ఇక కొన్ని యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్ అంశాలను లేవనెత్తకపోయి ఉంటే తను ముందస్తుగా ప్రిపేర్ అయి వచ్చిన ప్రసంగాన్ని చదివేవాడినని గవర్నర్ మహ్మద్ ఆరిఫ్ ఖాన్ తెలిపారు. ఇక కొందరు అతిథులు షేమ్ షేమ్ అంటూ నినదించారు. ఇక ఎలాంటి సందర్భం లేకపోయినప్పటికీ గాంధీ, ఆజాద్లాంటి వారి పేర్లను గవర్నర్ ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు.
గవర్నర్ ఆర్ఎస్ఎస్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారు: ఎంపీ కేకే రాగేష్
ఇదిలా ఉంటే గవర్నర్ ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిలా మాట్లాడుతున్నారని సీపీఐఎం ఎంపీ కేకే రాగేష్ మాట్లాడారు. ఆజాద్ గురించి ప్రస్తావించినప్పుడు గాడ్సే పేరు చెప్పాలని హబీబ్ కోరినట్లు ఎంపీ రాగేష్ చెప్పారు. మరోవైపు గవర్నర్ సందర్భం లేని అంశాలను ప్రస్తావించారని అలీగర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ షిరీన్ మూస్వీ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు తెలపుతుండగా అది సరికాదని చెప్పడం సమంజసం కాదని.. కేవలం ముస్లింలే ఈ ఆందోళనలు చేస్తున్నారనే ముద్రవేయడం ఆమోదయోగ్యం కాదని హబీబ్ ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా చేస్తే భారతదేశంకు అర్థం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.