భారీవర్షాలు: కేరళ తర్వాత..పంజాబ్ పై పగబట్టిన ప్రకృతి
పంజాబ్ : పంజాబ్, హర్యానా, ఛండీఘడ్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడోరోజు అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణశాఖ పంజాబ్ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించింది. అక్కడ వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం అలర్ట్గా ఉండాలంటే హెచ్చరికలు జారీ చేసింది. కంగ్రా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఒక వక్తి కొట్టుకుపోయి మృతి చెందాడు.
ఇదిలా ఉంటే భారీ వర్షాలు కురుస్తుండటంతో పంజాబ్లో పత్తి, వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమతత్తతో ఉండాలని కంట్రోల్ రూమ్లను యాక్టివేట్ చేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఆర్మీని దించింది రాష్ట్ర ప్రభుత్వం. సహాయక శిబిరాలను కూడా ముందుగానే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరోవైపు పంజాబ్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి స్కూళ్లకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. హిమాచల్ ప్రదేశ్లో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
పంజాబ్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. రంజిత్ సాగర్ డ్యామ్ నిండుతుండటంతో ఇప్పటికే అక్కడి ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. రంజిత్ సాగర్ డ్యామ్ రిజర్వాయర్ 527.91 మీటర్లుండగా...ప్రస్తుతం 524.80 మీటర్ల లెవెల్ వరకు నీరు వచ్చి చేరింది. దీంతో ముకేరియన్, హోషియార్పూర్ జిల్లాల్లోని పలు గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు.