రైల్వే టీటీఈలకు కొత్త బాధ్యత..ఇకపై రైళ్లో వాటిని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది
రైలు ప్రయాణిస్తున్న సమయంలో టికెట్ చెక్ చేసేందుకు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ వస్తాడు. ప్రయాణికుల టికెట్ను చెక్ చేసుకుంటాడు. ఇప్పటి వరకు టికెట్ చెక్ చేయడమే అతని బాధ్యతగా ఉండేది. దీనికి మరో అదనపు బాధ్యతను కూడా రైల్వేశాఖ టీటీఈలకు అప్పగించింది. ఇంతకీ టీటీఈలకు అదనంగా రైల్వే శాఖ ఇచ్చిన బాధ్యతలు ఏమిటి..?
టీటీఈలకు కొత్త బాధ్యత
రైల్వే శాఖ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఆలోచనతో టీటీఈలకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ప్రయాణికుల టికెట్ చెక్ చేయడంతో పాటు జనరల్ మరియు స్లీపర్కోచ్లలో ఉండే టాయ్లెట్స్ను చెక్ చేసే బాధ్యత కూడా టీటీఈలు తీసుకోవాల్సి ఉంటుంది. టాయ్లెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయో లేదో చూసి ఒకవేళ శుభ్రంగా లేకపోతే రైలులో ఉండే క్లీనింగ్ సిబ్బందిని పిలిచి వారితో శుభ్రం చేయించేలా ఆదేశించాలని రైల్వేశాఖ తెలిపింది. అంతేకాదు కోచ్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా సిబ్బందికి సూచించాలని వెల్లడించింది.
రైల్వే బోర్డుకు రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగది సూచనలు
ఇక కోచ్లలో నీటి సదుపాయం ఉందా లేదా అనేది కూడా పరిశీలించాల్సిన బాధ్యత టీటీఈలకే అప్పజెప్పింది. నిర్ణీత సమయానికి కోచ్లు క్లీన్ అయ్యేలా చూసుకోవాలని రైల్వే శాఖ తెలిపింది. రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగది ఈ మేరకు రైల్వే బోర్డుకు సూచనలు చేశారు.ఇక ఈ నెలాఖరు కల్లా అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఇక కోచ్లను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయాణికుల్లో కూడా అవగాహన తీసుకొస్తామని ఆయన తెలిపారు. ప్రయాణికులు ఇందుకు సహకరించాలని సురేష్ అంగది వెల్లడించారు.
సాధారణ బోగీలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయా లేదా చెక్ చేయాలి..?
ఇక ఫిర్యాదులు వస్తే స్వయంగా మంత్రే రైళ్లను ఇన్స్పెక్ట్ చేస్తారని చెప్పారు. అంతేకాదు ప్రయాణికులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ను కూడా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి సురేష్ అంగది తెలిపారు. ఇప్పటి వరకు టీటీఈలు ఏసీ కోచ్లలో మాత్రమే అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసేవారు. ఇకపై జనరల్ బోగీల్లో స్లీపర్ కోచ్లలో కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. జనరల్ బోగీల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నందున అక్కడి టాయ్లెట్లలో పరిశుభ్రత లోపిస్తున్న క్రమంలో రైల్వే చర్యలు తీసుకోవాలని భావిస్తున్న సమయంలో ఈ ప్రకటన రావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ కొత్త బాధ్యతలు చేపట్టేందుకు టీటీఈలు సుముఖంగా లేరని తెలుస్తోంది.
కొత్త బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తున్న టీటీఈలు
టికెట్లు పరిశీలన చేసే సమయంలో తమ దృష్టికి సమస్యలు వస్తే పరిష్కరిస్తాం కానీ... మిగతా కోచ్లలో పరిస్థితిని ఎలా సమీక్షిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. కోచ్లను పరిశుభ్రంగా ఉంచే సిబ్బందిని ప్రైవేట్ సంస్థలు నియమిస్తాయని సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోరని టీటీఈ ఒకరు చెప్పారు. ఇదిలా ఉంటే గత మోడీ పాలనలో ప్రయాణికుల దగ్గర నుంచి రైల్వే శాఖ ఫీడ్బ్యాక్ తీసుకుంది. అయితే ప్రయాణికులు ఇచ్చిన సమస్యల జాబితాలో టాయ్లెట్ల సమస్యే ఎక్కువగా ఉంది. ఇక అప్పటి నుంచి రైళ్లలో పరిశుభ్రతపై రైల్వేశాఖ మరింత దృష్టి సారించింది.ప్రధాన రైళ్లలో హౌజ్ కీపింగ్ స్టాఫ్ను నియమించింది.అయితే వీరు ఎక్కువగా ఏసీ కోచ్లలోనే ఉండి పనిచేస్తున్నారు.