టాప్ హిజ్బుల్ కమాండర్ రియాజ్ హతం?: ఉగ్రదాడులకు ప్రతీకారం, పాక్కి షాక్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో గత కొద్ది రోజులుగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతూ పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జవాన్లు వారి మరణాలకు గట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. పక్కా సమాచారం ఉగ్రవేటను కొనసాగిస్తూ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
స్వగ్రామానికి వచ్చిన రియాజ్ నైకూ..
ఇప్పటికే పుల్వామా జిల్లా షార్షలీలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇక మరో ఆపరేషన్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూ పోలీసులు, జవాన్ల వలలో చిక్కాడు. ఇటీవల అతను తన స్వగ్రామం బెయ్పొరకు వచ్చినట్లు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన దళాలు మంగళవారం రాత్రి ఆ గ్రామాన్ని దిగ్బంధించారు.
రియాజ్ హతమయ్యాడు?
ఉగ్రవాది ఉన్న ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు జరిపారు. ఇప్పటికే ఉగ్రవాది రియాజ్ నైకూ హతమైనట్లు సమాచారం. అయితే అధికారులు మాత్రం అతని మరణంపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మంగళవారం రాత్రి నుంచి ఉగ్రవాదులు, జవాన్లకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
Recommended Video
భారీ విజయమే.. పాక్కి మాత్రం..
ఇది ఇలావుండగా, ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన రియాజ్ 33 ఏళ్ల వయస్సులో ఉగ్రవాదిగా మారాడు. కరుగుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్ తీసుకున్నాడు. మరో కీలక ఉగ్రవాది జాకీర్ ముసా హిజ్బుల్ నుంచి వేరుపడిన తర్వాత సంస్థలో రియాజ్ కీలక ఉగ్రనేతగా మారిపోయాడు. కాశ్మీర్లో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ ముష్కర మూకల్ని తయారు చేస్తున్నాడు. రియాజ్.. స్థానిక స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్(ఎస్పీవో)ను బెదిరించి రాజీనామా చేయించడంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నాయి. కాగా, రియాజ్ హతమైన విషయం నిజమైతే ఉగ్రపోరులో భద్రతా దళాలు భారీ విజయం సాధించినట్లే. అంతేగాక, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్కు ఇది పెద్ద చేదువార్తే కానుంది.