లోక్ సభ ఎన్నికల్లో జయలలిత మేనకోడలు దీపా పార్టీ: పొత్తులు లేవు: ఉప ఎన్నికలకు సై, ప్రభుత్వం!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు జే. దీపా తన పార్టీ అభ్యర్థులను లోక్ సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల బరిలో దింపుతున్నారు. జయలలిత మేనకోడలు దీపాకు చెందిన ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీ అభ్యర్థులు లోక్ సభ ఎన్నికలు, శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని ఒక లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని దీపా ప్రకటించారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, బీజేపీ పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికలు, శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ డీఎంకే పార్టీ తన మిత్రపక్ష పార్టీ కాంగ్రెస్ తో కలిసి లోక్ సభ, శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇక చిన్నాచితక పార్టీలు సైతం లోక్ సభ, శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే జయలలిత మేనకోడలు దీపా మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు.
40 లోక్ సభ నియోజక వర్గాల్లో, 18 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీ అభ్యర్థులు ఒంటరిగా పోటీ చేస్తారని, తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని దీపా తెలిపారు. జయలలిత అభిమానులు అందరూ తమ వెంట ఉన్నారని దీపా చెప్పారు.
అమ్మ జయలలిత, ఎంజీఆర్ అభిమానులు తమ వెంట ఉన్నారని, తమిళనాడు ప్రజలు తమను ఆదరిస్తారని జయలలిత మేనకోడలు దీపా ధీమా వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసిన దీపా డిపాజిట్లు కోల్పోయారు.