జర్నలిస్టు హత్య కేసు: ఛోటా రాజన్ సహా దోషులందరికీ జీవిత ఖైదు
న్యూఢిల్లీ/ముంబై: సుమారు ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన జర్నలిస్టు హత్య కేసులో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ సహా ఎనిమిదిమంది దోషులకు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. జర్నలిస్టు జ్యోతిర్మయి డే హత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న జిగ్నా వోరాను మాత్రం ఆధారాలు లేని కారణంగా నిర్ధోషిగా విడుదల చేసింది.
జర్నలిస్టు హత్య కేసు: ఛోటా రాజన్ను దోషిగా తేల్చిన కోర్టు
సీనియర్ జర్నలిస్టు జ్యోతిర్మయి డే మిడ్డే పత్రికలో పనిచేసేవారు. 2011 జూన్లో తన ఇంటి సమీపంలోనే ఆయనను తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాగా, ఛోటా రాజన్.. జర్నలిస్టును హత్య చేయాలని ఆదేశించినట్లు అధికారుల విచారణలో తేలింది.
20మంది గ్యాంగ్స్టర్లకు సంబంధించిన సమాచారంతో జ్యోతిర్మయి డే ఓ పుస్తకం రాయాలనుకున్న నేపథ్యంలో చోటా రాజన్ ఈ హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడైంది. జ్యోతిర్మయి డేను హత్య చేసేందుకు ఛోటా రాజన్.. రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని, కాంట్రాక్టు కిల్లర్ను నియమించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.