జయ మారారా?: కరుణ, స్టాలిన్ ఇళ్లకు అన్నాడీఎంకే నేతలు
చెన్నై: దేశంలోనే తమిళనాట ఎన్నికలు ఎంతో ప్రత్యేకం. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే పోటీ. అంతేకాదు అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే డీఎంకే నేతలకు ఇబ్బందులు. అదే విధంగా డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు అన్నాడీఎంకే నేతలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు.
ఇది సామాన్య కార్తకర్తల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల వరకు ఉంటుంది. గతంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను డీఎంకే చీఫ్ కరుణానిధి జైలుకు పంపిస్తే, తిరిగి జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత కరుణానిధిని జైలుకు పంపించారు. ఇదీ తమిళనాట రాజకీయాల్లోఇప్పటి వరకు మనకు కనిపించిన పిరిస్థితి.
అయితే ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చినా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ప్రతీకారం తీర్చుకోమని డీఎంకే చీఫ్ కరుణానిధి బహిరంగంగానే ప్రకటించారు. అయినా సరే తమిళ తంబీలు కరుణానిధిని కాదని ఉచిత హామీలు గుప్పించిన 'అమ్మ'కే పట్టం కట్టారు.
అయితే ఎన్నికల విజయానంతరం అన్నాడీఎంకే అధినేత్రి జయలలితలో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అంతేకాదు తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా జయలలిత రెండు రోజుల క్రితం కరుణానిధితో పాటు ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్కు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు.
ఆహ్వానాలతో పాటు జయలలిత పార్టీకి చెందిన సీనియర్ నేతలు స్వయంగా కరుణానిధి, ఎంకే స్టాలిన్లను కలిసి 'అమ్మ' ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. డీఎంకే విషయంలో ఎంతో కఠినంగా వ్యవహారించే జయలలిత తీరును చూసి పార్టీ నేతలు ఆశ్చర్యపోయారని తెలుస్తోంది.
స్వయంగా నేతలను కరుణానిధి ఇంటికి పంపించి వారిని ఆహ్వానించడం వెనుక ఆంతర్యమేమిటో కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు. అయితే జయ ఆహ్వానాన్ని మన్నించిన డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి జయలలిత ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
జయలలిత పంపిన ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన ఆయన చెన్నైలోని మద్రాస్ యూనివర్సిటీలో జరిగిన జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నాం 12 గంటలకు ప్రమాణస్వీకారం ఉండగా ఆయన అరగంట ముందుగానే 11.30 గంటల ప్రాంతంలో మద్రాసు యూనివర్శిటీ సెంటినరీ ఆడిటోరియం వద్దకు చేరుకున్నారు.
డీఎంకే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు టిఎం అన్బరసన్, పొన్ముడి ఆయన వెంట వచ్చారు. ప్రాంగణంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సీట్లకు వెనుకగా డీఎంకే సభ్యులకు సీట్లు కేటాయించారు. 2001లోనూ జయలలిత ప్రమాణస్వీకారానికి స్టాలిన్ హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఆరోసారి ప్రమాణస్వీకారం చేశారు.
వరుసగా రెండోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణం చేశారు. 28మందితో జయలలిత తన మంత్రివర్గం ఏర్పాటు చేశారు. కాగా, మే 19న ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే 134 సీట్లు గెలుచుకోగా, డిఎంకె కూటమి 98 సీట్లు గెలుచుకుని గట్టి ప్రతిపక్షంగా నిలిచింది.