ఆర్మీ గస్తీ బృందంపై రాళ్లవర్షం.. కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి, 9 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్లోని సోఫియాన్ జిల్లా గనౌపుర ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఆర్మీ గస్తీ బృందంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులను నిలువరించేందుకు గస్తీ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు.
శ్రీనగర్: ఆర్మీ గస్తీ బృందంపై రాళ్లు రువ్విన ఆందోళనకారులను నిలువరించేందుకు గస్తీ దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందారు. మరో 9 మంది గాయపడ్డారు. జమ్మూకశ్మీర్లోని సోఫియాన్ జిల్లా గనౌపుర ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆర్మీ గస్తీ బృందంపై కొందరు యువకులు రాళ్లవర్షం కురిపించడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తిందని, ఇందుకు ప్రతిగా ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో గాయపడి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించిన యువకుడిని 17 ఏళ్ల జావిద్ అహ్మద్ భట్గా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి ఆర్మీపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కశ్మీర్ లోయలో రాళ్లు రువ్విన కేసుల్లో ఆందోళనకారులకు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఈ తాజా ఘటన చోటుచేసుకుంది.