తల్లిదండ్రులను తీసుకొచ్చి లొంగిపోవాలన్నా..: ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా, ఆదివారం జదిబాల్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆదివారం జదిబాల్, పోజ్వల్ పోరా ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల జాడను పసిగట్టారు.
అదే సమయంలో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అయితే, ఆ ఉగ్రవాదుల తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకొచ్చిన భద్రతా దళాలు.. వారితో లొంగిపోవాలని చెప్పించాయి. అయినప్పటికీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా, మరణించిన వారిలో ఒకరు 2019 నుంచి టెర్రరిస్టుల ఆపరేషన్స్లో యాక్టివ్ ఉన్నాడని, మరొకరు మే నెలలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు ఓ పోలీసు గాయపడ్డారు.
ఈ మేరకు వివరాలను కాశ్మీర్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో శ్రీనగర్లో తాత్కాలికంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు తెలిసింది.
కాగా, శ్రీనగర్లో కేవలం ఒక నెల వ్యవధిలోనే ఇది రెండవ ఎన్ కౌంటర్ కావడం గమనార్హం. గత మే నెలలో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.