వారు తప్ప: కాశ్మీరీ నేతలకు గృహ నిర్బంధం నుంచి విముక్తి..ఎట్టకేలకు!
జమ్మూ: సుమారు రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ కు చెందిన రాజకీయ నాయకులకు విముక్తి లభించింది. బుధవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం వారందర్నీ గృహ నిర్బంధం నుంచి విముక్తులను చేసింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలను జారీ చేసింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులకు మాత్రమే విముక్తి కల్పించారు. మాజీ ముఖ్యమంత్రులు, కొందరు జాతీయ స్థాయి నాయకుల నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగుతోంది.
జమ్మూ కాశ్మీర్ భారత్ దే: నిజం ఒప్పేసుకున్న పాకిస్తాన్!
నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)లకు చెందిన సీనియర్ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా సుమారు 400 మందిపై మాత్రం గృహ నిర్బంధం కొనసాగుతోంది. పరిస్థితులకు అనుగుణంగా వారిని విముక్తులను చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ బీజేపీయేతర పార్టీల నాయకులు నిరసన ప్రదర్శనలకు దిగే అవకాశం ఉందని, ఫలితంగా శాంతిభద్రతలకు విఘాతం కలగొచ్చనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ప్రతిపక్ష పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆయా పార్టీల నేతలందర్నీ ప్రీవెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద తమ సొంత నివాసాల్లో బందీలుగా ఉంటూ వచ్చారు.
తాజాగా గృహ నిర్బంధం నుంచి విముక్తులైన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన దేవేందర్ రాణా, సుర్జీత్ సింగ్ సలాతియా, కాంగ్రెస్ నుంచి రామన్ భల్లా, జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ నాయకుడు హర్షదేవ్ సింగ్, చౌధరి లాల్ సింగ్, వికార్ రసూల్, జావేద్ రాణా, సజ్జద్ అహ్మద్ కిచ్లూ తదితరులు ఉన్నారు. ఈ నెల 24వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. సుమారు 300లకు పైగా బ్లాకుల్లో ఎన్నికలను పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడి కానున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర స్థాయి నాయకులు మాత్రమే ప్రభుత్వం విముక్తి కల్పించింది.