జమ్ము కాశ్మీర్: బీజేపీ ఉపముఖ్యమంత్రి రాజీనామా, కొత్త ఎమ్మెల్యేతో భర్తీ
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జమ్ము కాశ్మీర్ నూతన ఉప ముఖ్యమంత్రిగా కవిందర్ గుప్తా పదవి చేపట్టనున్నారు.
మంత్రుల స్థానాల్లో మార్పుల కారణంగా నిర్మల్ సింగ్ రాజీనామా చేశారు. నిర్మల్ సింగ్ 4 ఏప్రిల్ 2016 నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో పీడీపీ, బీజేపీ రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై నిర్మల్ సింగ్ మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కథువా అత్యాచారం, హత్య కేసు నేపథ్యంలో బీజేపీ మంత్రులందరినీ రాజీనామా చేయాలని గతంలోనే పార్టీ అధిష్టానం ఆదేశించింది. కేవలం నిర్మల్ సింగ్ను మాత్రమే మంత్రిగా కొనసాగించారు.
కథువా కేసులో క్రైమ్ బ్రాంచ్ దర్యాఫ్తు కోసం ముఫ్తీ నిర్ణయించారు. దీనిని నిర్మల్ సింగ్ సమర్థించారు. అయితే ఇతర బీజేపీ నాయకులు చాలామంది సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. నిర్మల్ సింగ్కు ముఫ్తీతో సంబంధాలు ఉన్నాయి. బీజేపీ - పీడీపీ పొత్తు కోసం ఆయన ప్రయత్నాలు కూడా చేశారు.
ఇక, నిర్మల్ సింగ్ స్థానంలో మంత్రి పదవి దక్కించుకోనున్న కవీందర్ గుప్తా తొలిసారి ఎమ్మెల్యే. ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. 2005 నుంచి 2010 వరకు జమ్ము మేయర్గా మూడుసార్లు పని చేశారు.