బీజేపీ దెబ్బ, జమ్ము కాశ్మీర్లో కలకలం: ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా పత్రాన్ని మంగళవారం గవర్నర్కు పంపించారు. ముఫ్తీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. దీంతో ఆమె ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వం మైనార్టీలో పడిన నేపథ్యంలో ఆమె రాజీనామా సమర్పించారు. ముఫ్తీ రాజీనామా చేసిన తర్వాత ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా గవర్నర్ను కలిశారు.
రంజాన్ తర్వాత కూడా కాల్పులు కొనసాగుతాయని, ఉగ్రవాదుల వేట కొనసాగుతుందని కేంద్రం ప్రకటించడంతో సీఎం ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకున్నారు. వారితో చర్చించిన తర్వాత పీడీపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. దీంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రైజింగ్ కాశ్మీర్ సంపాదకులు సుజాత్ బుఖారీ హత్య, ఆ తర్వాత ఆర్మీ రైఫిల్మెన్ ఔరంగజేబును ఉగ్రవాదులు హత్య చేసిన తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
కాల్పుల విరమణ ఒప్పందంపైనే విభేదాలు
కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో మిత్రపక్షాల మధ్య విభేదాలు వచ్చాయి. ఒప్పందం కొనసాగించాలని ముప్తీ చెప్పగా, బీజేపీ ససేమీరా చెప్పింది. కాశ్మీర్ ఇష్యూపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కాశ్మీర్లో జరుగుతున్న దానికి రెండు పార్టీలు (బీజేపీ, పీడీపీ) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్ వైఫల్యం నుంచి బీజేపీ పారిపోవాలని చూస్తోందన్నారు. ముఫ్తీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అన్నారు. శ్రీనగర్ నుంచి రామ్ మాధవ్ను పోటీ చేయమని చెప్పాలన్నారు.
మరోవైపు, కాశ్మీర్ లోయలో పౌరహక్కులు ప్రమాదంలో పడ్డాయని రామ్ మాధవ్ అన్నారు. కాశ్మీర్లో శాంతిస్థాపనకు కృషి చేశామని, అభివృద్ధికి ప్రయత్నించామని చెప్పారు. కాగా ముఫ్తీ రాజీనామా నేపథ్యంలో కాశ్మీర్లో గవర్నర్ పాలనకు అవకాశముంది.