ఉగ్రవాదులు నన్ను గుర్తించలేరు: వేషం మార్చి ఇంటికెళ్తున్న ఎస్సైపై కాల్పులు, మృతి
శ్రీనగర్: తన కుటుంబాన్ని చూసేందుకు ఓ ఎస్సై వేషం మార్చుకొని ప్రభుత్వ వాహనంలో కాకుండా సొంత వాహనంలో స్వస్థలానికి బయలుదేరారు. కానీ ఉగ్రవాదులకు అతని గురించి తెలిసి వెంటాడి, అడ్డుకొనని హతమార్చారు. ఈ సంఘటన జమ్ము కాశ్మీర్లో జరిగింది.
జమ్మూ కాశ్మీర్కు చెందిన ఇంతియాజ్ అహ్మద్ మీర్ కుల్గాం పట్టణంలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతం ఉగ్రవాదుల అడ్డా. దీంతో స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి. కానీ తన తల్లిదండ్రులను ఎలాగైనా కలవాలని చెప్పి మారు వేషం ధరించారు ఇంతియాజ్.
ఇక ఉగ్రవాదులు నన్ను గుర్తించలేరని సహోద్యోగులకు చెప్పి తన సొంత వాహనంలో ఇంటికి బయలుదేరారు. అయినా ఉగ్రవాదులు అతనిని గుర్తించి హత్య చేశారు. ఇంతియాజ్ వాహనాన్ని వెంటాడి పుల్వామా జిల్లాలోని వాహిబుగ్ ప్రాంతంతో అడ్డుకున్నారు. ఆయనను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చారు.
ఎస్సై ఇంతియాజ్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందని, పుల్వామాలో ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారని, ఈ దారుణమైన ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇంతియాజ్ కుటుంబీకులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నామని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.