పీడీపీకి మద్దతిచ్చేది లేదు, మోడీకి అప్పుడే చెప్పా: ఆజాద్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు.
జమ్మూకాశ్మీర్లో జరిగిన పరిణామాలు మంచివేనని ఆజాద్ అన్నారు. అయితే, పీడీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణానికి తెరపడటంతో జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. మూడేళ్ల పాలనలో చాలా మంది పౌరులు, సైనికులు మృతి చెందారని వివరించారు.
ఈ కూటమి రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా నాశనం చేసిందని మండిపడ్డారు. పీడీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే హిమాలయాలంత తప్పు చేస్తున్నారని తాను గతంలోనే ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు ఆజాద్ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు నిజమయ్యాయని అన్నారు.