గవర్నర్కు లేఖ: పిడిపికి మద్దతిస్తామని ఒమర్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ముందుకు వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము పిడిపికి మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారంనాడు గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖ రాశారు.
రాష్ట్రంలో 28 శాసనసభా స్థానాలకు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పిడిపికి మద్దతు ఇస్తామని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ కోర్ గ్రూప్ సోమవారంనాడు సమావేశమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు బిజెపికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. ప్రాంతీయ పార్టీ అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీకి (పిడిపికి) మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు ఏ పార్టీ గానీ కూటమి గానీ ముందుకు రాలేదు. జనవరి 9వ తేదీన రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించాలని ఒమర్ అబ్దుల్లా కోరారు.
ఇటీవల జరిగిన శానససభ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఆధిక్యత రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. బిజెపి, పిడిపి మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. మద్దతు తీసుకోవడానికి బిజెపికి పిడిపి షరతులు పెట్టింది. ఆ షరతులకు అంగీకరించడానికి బిజెపి సిద్ధంగా లేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో కూడా ప్రతిష్టంభన ఏర్పడింది.