వేర్పాటువాది మసరత్ ఆలం అరెస్ట్ కు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: భారత వ్యతిరేక కార్యాక్రమాలు చేపట్టి జమ్మూ కాశ్మీర్ లో శాంతికి భంగం కలిగించే ఆందోళనలు చేసిన కరుడుగట్టిన వేర్పాటువాది మసరత్ ఆలంను అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఆలం విడుదలైన తర్వాత కాశ్మీర్లోని పలువురు ఆందోనళకారులు, ఉగ్రవాదులతో సంబంధం ఉన్నవారిని, కరుడుగట్టిన వేర్పాటువాదులను కలిసి భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించాడని వెలుగు చూసిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అరెస్టు చెయ్యాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో జమ్ము- కాశ్మీర్లో అధికారంలో ఉన్న పీడీపీ పార్టీ పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంలో భాగస్వాములైన మమ్మల్ని ఒక్కమాట అడగకుండా ఆలంను ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు.
తొదరపడి ఆలంను విడుదల చేశామని ఇప్పడు పీడీపీ ఆలోచనలో పడిందని తెలుస్తోంది. బయటకు వచ్చిన ఆలం కాశ్మీర్లో రెచ్చగొట్టే కార్యాక్రమాలు చేపడితే తమకే సమస్యలు ఎదురౌతాయని పీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఆలంను అరెస్టు చెయ్యడం మంచిదే లేదంటే అధికారం కొల్పోతామని పీడీపీ నాయకులు జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్నారు.
దేశ భద్రతకు ముప్పు కలిగించే పనులు, కార్యక్రమాలు చేపడుతున్నారని వెలుగు చూస్తే ఎవరినైనా అరెస్టు చేసి ఆరు నెలల పాటు జైలులో పెట్టడానికి చట్టం అంగీకరిస్తుంది. ఇలాంటి పనులు చేసిన మసరత్ ఆలంను అరెస్ట్ చేసి నాలుగు సంవత్సరాల పాటు జైలులో పెట్టారు. ఇప్పుడు ఇదే కేసులో అతన్ని అరెస్టు చెయ్యడానికి వీలులేదు.
భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ నాయకులు సైతం ఆలం విడుదలపై మండిపడి నిరసన వ్యక్తం చేశారు. ఆలం విడుదలపై లోకసభలో పార్టీలకు అతీతంగా ఎంపీలు నిరసన వ్యక్తం చేసి నినాదాలు చేశారు. ఆలం మీద ఎదైనా కొత్త కేసు నమోదు చేసి అరెస్టు చేయ్యడానికి జమ్ము- కాశ్మీర్ డీజీపీ సిద్దం అయ్యారు. శుక్రవారం లోపు మసరత్ ఆలంను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.