టీటీడీ నిధులతో కాశ్మీర్లో మినీ తిరుమల..భూమిపూజ: హైవే పక్కనే: వేదపాఠశాల సహా
జమ్మూ: భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించ తలపెట్టిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణానికి ఇటుక పడింది. ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఈ ఆలయ నిర్మాణానికి ఈ ఉదయం భూమిపూజ చేశారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి దీనికి హాజరయ్యారు.
జమ్మూ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే మజీన్ ప్రాంతంలో టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించనుంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారికి ఆనుకునే ఉంటుందీ ప్రాంతం. దీనికి అవసరమైన భూసేకరణ ఇదివరకే పూర్తయింది. తాజాగా తిరుమలేశుడి ఆలయానికి భూమిపూజ కార్యక్రమాన్ని తలపెట్టింది టీటీడీ. మొత్తం 62 ఎకరాల్లో ఆలయ కాంప్లెక్స్ రూపుదిద్దుకోనుంది.
ఆలయం, వేద పాఠశాల, టీటీడీ ఉద్యోగుల క్వార్టర్లను నిర్మిస్తారు. తొలిదశలో వాటి నిర్మాణం పూర్తవుతుంది. రెండోదశలో భక్తులకు అవసరమైన కాటేజీల నిర్మాణానికి టీటీడీ పూనుకుంటుంది. మెడిటేషన్ సెంటర్ను ఇందులోనే నిర్మిస్తారు.
ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి టీటీడీ 33 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది. ఈ భూమి మొత్తాన్నీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు లీజుకు ఇచ్చింది. లీజు కాల పరిమితి 40 సంవత్సరాలు. ఆ తరువాత కూడా పొడిగించే అవకాశాలు లేకపోలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. కాగా దశలవారీగా నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రధాన ఆలయాన్ని రెండేళ్లలో నిర్మించాలని ప్రణాళికలను రూపొందించినట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత.. అక్కడ ఆలయం నిర్మిస్తామని అప్పట్లోనే ప్రకటించింది టీటీడీ. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది.