సోపోర్ ఎన్కౌంటర్: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అసిఫ్ హతం
శ్రీనగర్: ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. మోస్ట్ వాంటెడ్ అష్కరే తొయిబా ఉగ్రవాది ఆసిఫ్ను బుధవారం భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఓ పండ్ల వ్యాపారి కుటుంబంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 30 నెలల అస్మాజాన్ను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఉగ్రదాడికి ఆసిఫ్ నాయకత్వం సూత్రధారిగా ఉండటం గమనార్హం.
సోపోర్ జిల్లాలో బుధవారం ఉదయం ఆసిఫ్ ఓ కారులో ప్రయాణిస్తుండగా చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, అతను కారు ఆపకుండా దూసుకెళ్లాడు. దీంతో భద్రతా బలగాలు అతడ్ని వెంబడించాయి. కాగా, ఆసిఫ్ భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డాడు.
ఈ క్రమంలో భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది ఆసిఫ్ హతమయ్యాడు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసిఫ్ హతమవడం లష్కరే తొయిబాకు పెద్ద నష్టమేనని చెప్పవచ్చు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడకుండా చిన్నారి అస్మా జాన్ కుటుంబసభ్యులు తమ పండ్ల దుకాణాన్ని తెరిచారు. దీంతో ఆగ్రహించిన ఉగ్రవాది అసిఫ్ ఆ దుకాణంపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 30నెలల వయస్సున్న అస్మాజాన్ సహా ముగ్గురు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వలస కూలీపై జరిగిన దాడిలోనూ అసిఫ్ హస్తం ఉందని పోలీసులు తెలిపారు.