మున్సిపల్ ఎన్నికల్లో జమ్ము కాశ్మీర్లో సత్తాచాటిన బీజేపీ: జమ్ము, 4 జిల్లాల్లో క్లీన్ స్వీప్
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఉగ్రవాద కదలికలు ఉన్న అనంత్ నాగ్, కుల్గాం, పుల్వామా, పోషియాన్ జిల్లాల్లో బీజేపీ విజయం సాధించింది. కాశ్మీర్ లోయలో బీజేపీ తొలిసారి 97 వార్డుల్లో విజయఢంకా మోగించింది. అదే సమయంలో లఢక్ ప్రాంతంలో మాత్రం సత్తా చాటలేకపోయింది.
కథువాలో బీజేపీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ బీజేపీకి 80 స్థానాలకు గాను 34 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 19 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 27 చోట్ల స్వతంత్ర్య అభ్యర్థులు గెలిచారు. జమ్ము కాశ్మీర్లో బీజేపీ సత్తా చాటడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలకు అనుకూలంగా పార్టీ పని చేయాలన్నారు.
జమ్ము, 4 జిల్లాల్లో బీజేపీ క్లీన్ స్వీప్
ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలైన అనంత్నాగ్, కుల్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కాశ్మీర్ లోయలో బీజేపీ మొదటిసారి 97 వార్డుల్లో విజయం సాధించింది. బారాముల్లాలో 25, అనంత్నాగ్లో 29, షోపియాన్లో 12 వార్డుల్లో బీజేపి జెండా ఎగిరిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రామ్మాధవ్ తెలిపారు. జమ్ము కార్పొరేషన్లో 75 స్థానాలకు గాను బీజేపీ 43 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 14, స్వతంత్రులు 18 చోట్ల గెలిచారు.
శ్రీనగర్లో స్వతంత్రులు
షోపియన్లో ఎలాంటి వ్యతిరేకత లేకుండా బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. మున్సిపల్ కమిటీలో 7 వార్డుల్లో బీజేపీ రెండు, కాంగ్రెస్ నాలుగు, స్వతంత్ర్య అభ్యర్థిఒక చోట గెలుపొందారు. శ్రీనగర్లో స్వతంత్ర్య అభ్యర్థులు ఎక్కువమంది గెలిచారు. శ్రీనగర్లోని 74 స్థానాలలో 49 మంది స్వతంత్రులు, 12 మంది కాంగ్రెస్, 4గురు బీజేపీ అభ్యర్థులు గెలిచారు.
ఇక్కడ కాంగ్రెస్ గెలుపు
లడక్, లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది. లేహ్ పురపాలక కమిటీలో కాంగ్రెస్ 13 స్థానాలను తన కైవసం చేసుకోగా, కార్గిల్లో ఐదు స్థానాల్లో గెలిచింది. మిగతా ఆరు స్థానాల్లో స్వతంత్ర్య అభ్యర్థులు గెలుపొందారు. సాంబ జిల్లాలో బీజేపీ 18 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ తొమ్మిది, స్వతంత్ర్య అభ్యర్థులు 27 వార్డుల్లో విజయం సాధించారు. జమ్ము, లడాక్ ప్రాంతాల్లో అత్యంత తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కేవలం 3.4శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. కాశ్మీర్లోయలోని అత్యధిక వార్డుల్లో బరిలో నిల్చున్న అభ్యర్థులు కేవలం మూడు నుంచి పది ఓట్లు మాత్రమే గెలిచారు.
13 ఏళ్ల తర్వాత ఎన్నికలు
మున్సిపల్ ఎన్నికలు అక్టోబర్ 8 నుంచి 16 (8వ తేదీ, 10, 13, 16వ తేదీలలో)వరకు జరిగాయి. 3000 మందికి పైగా అభ్యర్థులు నిలబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 1145 వార్డులు ఉన్నాయి. కాశ్మీర్లో 598 వార్డులు ఉండగా ఇందులో దాదాపు 231 వార్డుల్లో పోటీ లేకుండా ఎన్నికయ్యారు. 181 చోట్ల ఒక్క అభ్యర్థీ పోటీ చేయలేదు. 35.1 శాతం ఓటింగ్ నమోదయింది. ఇక్కడ 13 ఏళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించారు.