శ్రీనగర్లో పాక్ జెండాను ఎగరేసిన వేర్పాటువాద నేత: కేసు నమోదు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో పాకిస్థాన్ జాతీయ పతాకాన్ని ఎగురవేయడమే కాకుండా, ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించిన కాశ్మీర్ వేర్పాటువాద నేత ఆసియా అంద్రాబిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
హురియత్ కాన్ఫరెన్స్ మహిళా విభాగమైన దుఖ్తరన్ ఈ మిలత్కు ఆసియా నాయకత్వం వహిస్తున్నారు.
పాకిస్థాన్ జాతీయ దినోత్సవం రోజున అసియా బృందం శ్రీనగర్లో ఒక సభ ఏర్పాటు చేసి పాక్ పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించినందుకు ఆమెపై కేసు పెట్టారు. త్వరలో అసియాను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉండగా, తాను పాక్ పతాకాన్ని ఎగురవేయడమే కాదు.. మద్దతుదారులతో కలిసి జాతీయ గీతాన్ని కూడా పాడాను అని ఆసియా తెలిపారు.
కాగా, సోమవారం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విందు కార్యక్రమానికి హాజరైన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విందులో పాల్గొనడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటానని చెప్పారు.